ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Revelation chapter 8 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 8వ అధ్యాయము

 1. ఆ గొఱ్ఱెపిల్ల ఏడవ ముద్రను విప్పగా, పరలోకము ఒక అరగడియపాటు నిశ్శబ్దమాయెను.

2. దేవుని సమక్షమున నిలుచు ఏడుగురుదేవదూతలను నేను అప్పుడు చూచితిని. వారికి ఏడు బాకాలు ఇయ్యబడెను.

3. సువర్ణ ధూపపాత్రను ధరించిన మరియొక దేవదూత బలిపీఠమువద్ద నిలిచెను. పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపము ఒసగబడెను. సింహాసనము ఎదుటనుండు సువర్ణ బలిపీఠముపై అది అతనిచే అర్పింపబడెను.

4. దేవుని సమక్షమున ఉన్న ఆ దేవదూత హస్తములనుండి ధూపాన్ని ధూమము పునీతుల ప్రార్థనలతోపాటు పైకెగసెను.

5. అప్పుడు ఆ దేవదూత ధూప పాత్రను గైకొని బలిపీఠమునుండి సంగ్రహించిన అగ్నితో నింపి భువిపై విసరెను. దానితో ఉరుములును, గర్జనలును, మెరపులును, భూకంపములును సంభవించెను.

6. అంతట ఆ ఏడుగురు దేవదూతలు ఏడు బాకాలను ఊదుటకై సంసిద్ధమైరి.

7. మొదటి దేవదూత బాకాను ఊదెను. తోడనే రక్తముతో కూడిన వడగండ్లు, అగ్ని భువిపై ధారాపాతముగ వర్షించెను. భువిలో మూడవ పాలు దగ్గమయ్యెను. వృక్షములలో మూడవ వంతు దహింపబడెను. పచ్చగడ్డి కూడ భస్మమయ్యెను.

8. అంతట రెండవ దేవదూత తన బాకాను ఊదెను. మండుచున్న పెద్ద పర్వతము వంటిది ఏదియో సముద్రములోనికి విసరివేయబడెను.

9. దానితో సముద్రములో మూడవపాలురక్తముగా మారెను. జలచరములలో మూడవవంతు నశించెను. నౌకలలో మూడవ భాగము ధ్వంసమయ్యెను.

10. అంతట మూడవ దేవదూత తన బాకాను మ్రోగించెను. దానితో కాగడావలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలెను. అది మూడవ వంతు నదులపైనను, నీటి ఊటలపైనను పడెను.

11. అది చేదు అను పేరుగల నక్షత్రము. దానితో జలమున మూడవ వంతు చేదుగా మారెను. ఆ చేదు నీటిని త్రాగుటవలన చాలమంది మృత్యువుపాలైరి.

12. పిమ్మట నాలుగవ దేవదూత తన బాకాను మ్రోయించెను. సూర్యుడును, చంద్రుడును, నక్షత్రములును తమతమ కాంతులలో మూడవ భాగమును కోల్పోవునట్లు వానిలో తృతీయాంశము భగ్నము ఒన ర్పబడెను. రాత్రిలో మూడవ భాగమును, పగటిలో మూడవభాగమును కాంతిహీనములు అయ్యెను.

13. నేను అటు చూడగా గాలిలో ఎత్తుగా ఒక గ్రద్ద ఎగురుచుండెను. “అనర్ధము, అనర్థము, అనర్థము. మిగిలిన ముగ్గురు దేవదూతలు ఇంకను బాకాలు ఊదవలసి ఉన్నది. వానినుండి వెలువడెడి ధ్వని భువి యందలి ప్రజలకు ఎంత భయానకముగా ఉండునో!" అని ఆ గ్రద్ద బిగ్గరగా పలికెను.