ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Revelation chapter 5 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 5వ అధ్యాయము

 1. ఆ సింహాసనాసీనుడగు వాని కుడి చేతియందు ఒక గ్రంథమును నేను చూచితిని. ఆ గ్రంథమునకు ఇరుప్రక్కల వ్రాయబడి ఉండెను. అది ఏడు ముద్రలచే ముద్రింపబడి ఉండెను.

2. అప్పుడు అటనున్న ఒక గొప్ప దేవదూత బిగ్గరగా ఇట్లు ప్రకటించెను: “ఈ ముద్రలను పగులగొట్టి గ్రంథమును విప్పగల యోగ్యుడెవడు?"

3. అయితే పరలోకమందుగాని, భూమి మీదగాని, భూమి క్రిందగాని ఆ గ్రంథమును తెరచి, లోని విషయములను గ్రహింపయోగ్యుడగు వ్యక్తి ఎవడును కానరాడయ్యెను.

4. గ్రంథమును తెరచుటకుగాని, లోని విషయమును గ్రహించుటకుగాని యోగ్యుడగు వ్యక్తి ఒక్కడును లభింపకపోవుటచే నేను మిక్కిలి దుఃఖించితిని.

5. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లు పలికెను: “విలపింపకుము. చూడుము! యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్ఠుడు, గెలుపొందినాడు, అతడే ఏడు ముద్రలను పగులగొట్టి గ్రంథమును తెరువగలడు."

6. అప్పుడు ఆ సింహాసనము మధ్య ఒక గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట కనుగొంటిని. అది నాలుగు జీవుల చేతను, పెద్దల చేతను పరివేష్టింపబడియుండెను. ఆ గొఱ్ఱెపిల్ల వధింపబడినట్లు ఉండెను. అది ఏడు కొమ్ములను, ఏడు కన్నులను కలిగియుండెను. అవి భువికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు.

7. సింహాసనాసీనుడైన వ్యక్తి కుడిచేతినుండి ఆ గొఱ్ఱెపిల్ల ఆ గ్రంథమును గ్రహించెను.

8. ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, ఇరువది నలుగురు పెద్దలును ఆ గొఱ్ఱెపిల్లముందు సాగిలపడిరి. ఆ పెద్దలందరును వీణలను ధరించి బంగారుపాత్రలలో ధూపములను అర్పించుచుండిరి. ఆ ధూప ద్రవ్యములే పరిశుద్దుల ప్రార్థనలు:

9. వారొక క్రొత్త పాటను ఇట్లు పాడిరి: “గ్రంథమును గ్రహించుటకును, దాని ముద్రలను పగులగొట్టుటకు నీవు యోగ్యుడవు. ఏలయన, నీవు వధింపబడి నీ రక్తమువలన ప్రతి జాతినుండి, భాషనుండి, ప్రజలనుండి, తెగనుండి దేవునకై ప్రజలను కొంటివి.

10. మన దేవుని సేవించుటకు వారిని ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసితివి. వారు ఈ భువిని పాలింతురుగాక!”

11. నేను మరల చూచితిని. కోట్ల కొలదిగ దేవదూతలు పాడుట వింటిని. ఆ నాలుగు జీవులు, పెద్దలు, అందరును సింహాసనము చుట్టును నిలుచుండి ఇట్లు బిగ్గరగ పాడిరి.

12. “వధింపబడిన గొఱ్ఱెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది!" ,

13. త్రిలోకములయందలి ప్రతిజీవిని జలచరములను అన్నిటిని, సృష్టియందలి జీవకోటిని అంత టిని నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి: “సింహాసనాసీనునకును, గొఱ్ఱెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వతమగును గాక!”

14. ఆ నాలుగు జీవులును 'ఆమెన్' అని సమాధాన మొసగెను. పెద్దలు సాగిలపడి నమస్కరించిరి.