ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Revelation chapter 20 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 20వ అధ్యాయము

 1. అంతట దివినుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు, ఒక బరువైన గొలుసును ఉండెను.

2. సైతాను అనబడు ఆ ప్రాచీన సర్పమును, ఆ భయంకర సర్పమును అతడు పట్టుకొని ఒక వేయి సంవత్సరములపాటు బంధించెను.

3. ఆ దేవదూత, ఆ సైతానును అగాధములోనికి త్రోసి, ఒక వెయ్యి సంవత్సరముల పాటు మానవజాతిని ఆ సైతాను మోసగింపకుండ, ఆ అగాధమునకు తాళము పెట్టి ముద్రవేసెను. తదుపరి కొద్ది కాలము పాటు వానిని తిరిగి విడువవలసి ఉన్నది.

4. పిమ్మట సింహాసనములను, సింహాసనాసీనులగు వ్యక్తులను, అచట నేను చూచితిని. తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను. యేసుకు, దేవుని వాక్కుకు సాక్షులుగా శిరచ్ఛేదనము గావింపబడిన వ్యక్తుల ఆత్మలనుకూడ నేను అట చూచితిని. ఆ మృగమునుగాని, దాని విగ్రహమునుగాని వారు పూజింపలేదు. ఆ మృగ చిహ్నమునుకూడ వారు తమ నుదురులపైన గాని, చేతులపై గాని వేయించుకొన లేదు. వారు సజీవులై వచ్చి క్రీస్తుతో పాటు ఒక వేయి సంవత్సరములు పాలించిరి.

5. (మిగిలిన మృతులు వేయి సంవత్సరములు పూర్తియగు వరకును సజీవులు కాలేరు. ఇదియే మృతుల ప్రథమ పునరుత్థానము)

6. ఈ ప్రథమ పునరుత్థానమున పాలుగల వారందరును ధన్యులు, పవిత్రులు. రెండవ మరణమునకు వారిపై ప్రభావము ఉండదు. వారు దేవునకును, క్రీస్తునకును యాజకులగుదురు. వారు ఆయనతో కూడి ఒకవేయి సంవత్సరములు పాలింతురు.

7. వేయి సంవత్సరముల తరువాత చెరసాల నుండి సైతాను విడుదల చేయబడును.

8. అంతట గోగు, మాగోగు అనెడు ప్రపంచ నలుమూలల వ్యాప్తమైన సమస్త జాతులను మోసగించుటకు అతడు బయల్వెడలును. సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె ఉండిన వారినందరిని కూడగట్టుకొని సైతాను యుద్ధమునకు సిద్ధమగును.

9.వారు ప్రపంచ మందంతట వ్యాప్తినొంది, పరిశుద్ధుల శిబిరమును, ఆయన ప్రేమకు పాత్రమైన నగరమును చుట్టు ముట్టిరి. కాని దివినుండి అగ్ని దిగివచ్చి వారిని ధ్వంసమొనర్చెను.

10. అంతట ఆ మృగమును, అసత్య ప్రవక్తయును ఏ గంధకపు అగ్ని గుండములో నెట్ట బడిరో, మోసగాడగు ఆ సైతాను దాని లోనికే త్రోయ బడెను. వారు అహోరాత్రులు కలకాలము పీడింప బడుదురు.

11. అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనమును, దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. దివియు, భువియు ఆయన సమక్షము నుండి పారిపోయినవి. వాటికి స్థానము లేకుండెను.

12. పిన్నలును, పెద్దలును అగు మృతులందరు తారతమ్యము లేకుండ ఆయన సింహాసనము ఎదుట నిలిచి యుండుట అప్పుడు నేను గమనించితిని. గ్రంథములు విప్పబడెను. అంత సజీవుల గ్రంథమను మరియొక గ్రంథము తెరువబడెను. గ్రంథములలో వ్రాయబడి నట్టుగ వారివారి పనులనుబట్టి మృతులకు తీర్పు తీర్చ బడును.

13. అంత సముద్రము తనలోనున్న మృతులను వదలివేసెను. మృత్యువును, మృత్యులోకమును కూడ తమయందున్న మృతులను విడుదల చేసెను. అందరకు వారివారి పనులను బట్టియే తీర్పు చెప్పబడెను.

14. అంతట మృత్యువును, మృత్యులోకమును, అగ్నిగుండము లోనికి నెట్టబడెను. (ఈ అగ్ని గుండమే ద్వితీయ మృత్యువు)

15. జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరు అగ్ని గుండమున త్రాయ బడిరి! 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services