ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Revelation chapter 15 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 15వ అధ్యాయము

 1. అప్పుడు దివియందు నేనుమరియొక అత్యా శ్చర్యకరమగు సంకేతమును చూచితిని. ఏడు అరిష్టములను ధరించిన ఏడుగురు దేవదూతలు నాకు అట గోచరించిరి.ఇ వి తుది జాడ్యములు. ఏలయన, వానితో దేవుని ఆగ్రహము పరి సమాప్తమాయెను.

2. అగ్నితోకూడి గాజువలె మెరయుచు సముద్రమువలె విస్తరించియున్న ఒకదానిని నేను అట చూచితిని. ఆ మృగము పైనను, దాని విగ్రహము పైనను గెలుపును సాధించినవారిని, సంఖ్యచే సూచింపబడు నామము గలవాని పై విజయమును పొందిన వారిని కూడ నేను అట చూచితిని. వారు ఆ గాజు సముద్ర మువలె గోచరించు దాని తీరమున నిలబడి ఉండిరి. వారి చేతులలో దేవుడు ప్రసాదించిన వీణలు ఉండెను.

3. దేవుని సేవకుడగు మోషే గీతమును, గొఱ్ఱెపిల్ల గీతమును వారు ఇట్లు పాడుచుండిరి: “సర్వశక్తిమంతుడవగు దేవా! ఓ ప్రభూ! నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు! ఎంత మహిమాన్వితములు? సర్వజాతులకు చక్రవర్తీ! నీ మార్గములు ఎంత నిర్దోషములు, సత్యాన్వితములు!

4. ఓ ప్రభూ! నీ నామమునకు భయపడనివాడెవ్వడు? నీ మహిమను ప్రకటింపక తిరస్కరించు వాడెవ్వడు? ఏలయన, నీవు మాత్రమే పవిత్రుడవు. నీ సత్యార్యములు అందరకు సువిదితమైనవి. కనుక సర్వ జాతులును నిన్ను చేరి నిన్నే ఆరాధించును”.

5. తరువాత దివియందలి, సాక్ష్యపు గుడారము గల ఆలయము తెరువబడుట చూచితిని.

6. ఏడు జాడ్యములను ధరించిన ఏడుగురు దేవదూతలు ఆ ఆలయమునుండి బయల్వెడలిరి. వారు తెల్లని వస్త్ర ములను ధరించియుండిరి. వారి వక్షముల యందు బంగారపు పట్టీలు ఉండెను.

7. అంత, ఆ నాలుగు జీవులలో ఒకటి నిత్యుడగు దేవుని ఆగ్రహముతో నిండిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవ దూతలకును ఇచ్చెను.

8. దేవుని మహిమనుండి శక్తి నుండి వెలువడిన ధూమముతో ఆ ఆలయము నిండి యుండెను. ఆ ఏడుగురు దేవదూతలచే కల్పింపబడిన ఏడు జాడ్యములు ముగియునంతవరకు ఎవ్వరును ఆ ఆలయమును ప్రవేశింపజాలకపోయిరి.