ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 2 || Telugu catholic Bible || యోహాను సువార్త 2వ అధ్యాయము

 1. మూడవ దినమున గలిలీయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను.

2. యేసు, ఆయన శిష్యులును ఆ వివాహమునకు ఆహ్వా నింపబడిరి.

3. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి “వారికి ద్రాక్షరసము లేదు” అని ఆయనతో  చెప్పెను.

4. "స్త్రీ! అది నాకేమి? నీకేమి? నా గడియ ఇంకను రాలేదు” అని యేసు పలికెను.

5. ఆయన తల్లి సేవకులతో “ఆయన చెప్పినట్లు చేయుడు” అనెను.

6. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరురాతి బానలుండెను. ఒక్కొక్క బానలో రెండు మూడు కడవల నీరుపట్టును.

7. “ఆ బానలను నీటితో నింపుడు” అని యేసు వారికి చెప్పెను. అట్లేవారు వానిని అంచులవరకు నింపిరి.

8. అంతట ఆయన “మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు” అని చెప్పగా వారు అట్లే తీసికొనిపోయిరి.

9. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగ మారిన ఆ నీటిని రుచిచూచెను. అది ఎక్కడనుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియును. కనుక అతడు పెండ్లికుమారుని పిలిచి,

10. “ఎవడైనను మొదట శ్రేష్ఠమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరు మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని, నీవు శ్రేష్ఠమైన ద్రాక్షరసమును ఇప్పటివరకు ఉంచితివి” అని పలికెను.

11. ఈ విధముగా యేసు గలిలీయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచకక్రియను ప్రదర్శించి, తన మహిమను వెల్లడిచేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి.

12. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్నిదినములు ఉండిరి.

13. యూదుల పాస్కపండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను.

14. దేవాలయములో ఎడ్లను, గొఱ్ఱెలను పావురములను అమ్ము వారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను.

15. ఆయన త్రాళ్ళతో కొరడా పేని, గొఱ్ఱెలను, ఎడ్లను అన్నింటిని ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను.

16. పావురములను అమ్మువారితో “వీనిని ఇక్కడనుండి తీసికొనిపొండు. నా తండ్రి ఇంటిని వ్యాపారగృహముగా చేయవలదు” అని చెప్పెను.

17. “నీ గృహమునందు నాకుగల ఆసక్తి నన్ను దహించును” అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అపుడు తలపునకు వచ్చెను.

18. యూదులు అపుడు ఆయనతో “నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూ పెదవు?” అని ప్రశ్నించిరి.

19. అందుకు యేసు “ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని మూడు రోజులలో లేపుదును” అని వారికి సమాధాన మిచ్చెను.

20. “ఈ ఆలయ నిర్మాణమునకు నలువది ఆరు సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని మూడు రోజులలో లేపగలవా?” అని యూదులు తిరుగు ప్రశ్నవేసిరి.

21. కాని, వాస్తవముగ ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే.

22. ఆయన మృతులలోనుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి.

23. యెరూషలేములో పాస్కపండుగ సందర్భ మున ఆయన చేసిన అద్భుతకార్యములను చూచిన అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

24. కాని, యేసు వారిని అంతగా నమ్మలేదు.

25. ఏలయన, వారందరిని గూర్చి ఆయనకు తెలియును. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక, మానవస్వభావమును గూర్చి ఆయనకు ఎవ్వరును సాక్ష్యమీయనక్కరలేదు.