ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

John chapter 19 || Telugu catholic Bible || యోహాను సువార్త 19వ అధ్యాయము

 1. అపుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను.

2. సైనికులు ముళ్ళకిరీటమును అల్లి, దానిని ఆయన శిరస్సు పై పెట్టి, ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి.

3. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి, “యూదులరాజా! నీకు శుభము!" అని నమస్కరించి, ఆయనను చెంపపై కొట్టిరి.

4. పిలాతు మరల బయటకు వెళ్ళి, ప్రజలతో “ఇదిగో! ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలిసికొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసికొని వచ్చుచున్నాను” అని చెప్పెను.

5. అపుడు యేసు ముళ్ళకిరీటమును ఊదావస్త్రమును ధరింప చేయబడినవాడై బయటకు వచ్చెను. “ఇదిగో ఈ మనుష్యుడు” అని పిలాతు వారితో చెప్పెను.

6. ప్రధానార్చకులును, బంట్రోతులును ఆయనను చూచినంతనే “వానిని నిలువవేయుడు, సిలువ వేయుడు" అని కేకలు వేసిరి. “ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుట లేదు. మీరే ఈయనను తీసికొని వెళ్ళి సిలువవేయుడు" అని చెప్పెను.

7. అపుడు యూదులు “దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనుచున్నాడు. కనుక, మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే" అనిరి.

8. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి,

9. మరల అధికార మందిరములోనికి వెళ్ళి, యేసును “నీవు ఎక్కడినుండి వచ్చితివి?” అని ప్రశ్నించెను. కాని యేసు ఏమియు బదులు పలుకలేదు.

10. కనుక, పిలాతు “నీవు నాతో కూడ మాట్లాడవా? నిన్ను విడిచి పెట్టుటకును, సిలువవేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా?” అనెను.

11. అందుకు యేసు, “పైనుండి నీకు అధికారము ఈయబడని యెడల నీకు నా పై అధికారము ఏమాత్రము ఉండెడిది కాదు. అందుచే, నన్ను నీ చేతికి అప్పగించినవాడు, ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు” అని పలికెను.

12. అంతట పిలాతు ఆయనను విడిచి పెట్టుటకు మరి ఎక్కువగ ప్రయత్నింపసాగెను. కాని యూదులు, “ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు. తనను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి" అని కేకలువేసిరి.

13. పిలాతు ఈ మాటలు విని, యేసును వెలుపలకు తీసికొనివచ్చి, రాళ్ళుపరచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో 'గబ్బతా' అందురు.

14. అది పాస్కపండుగకు సిద్ధపడుదినము. ఇంచుమించు మధ్యాహ్నము పండ్రెండు గంటల సమయము. పిలాతు యూదులతో “ఇదిగో మీ రాజు!” అనెను.

15. అందుకు వారు, “ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువవేయుడు” అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో “నేను మీ రాజును సిలువ వేయుదునా?” అనెను. అందుకు ప్రధానార్చకులు “సీజరు తప్ప మాకు వేరొకరాజు లేడు” అని పలికిరి.

16. అపుడు పిలాతు యేసును సిలువవేయుటకు వారి చేతికి అప్పగించెను. కనుక వారు ఆయనను తీసుకొనిపోయిరి.

17. యేసు తన సిలువను మోసికొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో 'గొల్గొతా' అందురు.

18. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపుల మరి యిద్దరిని అట్లే సిలువ వేసిరి.

19. 'నజరేయుడగు యేసు, యూదుల రాజు' అను బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను.

20. యేసును సిలువవేసిన స్థలము నగరమునకు దగ్గరగ ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను.

21. అంతట యూదుల ప్రధానా ర్చకులు పిలాతుతో, “యూదుల రాజు అని వ్రాయకుము. 'నేను యూదులరాజును' అని అతడు చెప్పెనని వ్రాయుము” అనిరి.

22. అందుకు పిలాతు, “నేను వ్రాసినదేమో వ్రాసితిని. అంతే” అనెను.

23. యేసును సిలువవేసిన పిమ్మట, సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తలకొక భాగము తీసికొనిరి. వారు అంగీని సహితము తీసికొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టులేకుండ నేయబడియున్నందున,

24. “దీనిని చింపవద్దు. ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసికొందము” అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. “వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి. నా అంగీకొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి” అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందు వలననే సైనికులు ఇట్లు చేసిరి.

25. యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి, క్లోఫా భార్యయగు మరియమ్మయు, మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి.

26. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, “స్త్రీ! ఇదిగో నీ కుమా రుడు!” అనెను.

27. ఆ తరువాత శిష్యునితో “ఇదిగో నీ తల్లి” అనెను. శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొనిపోయెను.

28. పిదప, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, “నాకు దాహమగుచున్నది” అనెను. (లేఖనము ఇట్లు నెరవేరెను.)

29. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని 'హిస్సోపు' కోలకు తగిలించి ఆయనకు అందించిరి.

30. యేసు ఆ రసమును అందుకొని “సమాప్తమైనది" అని తల వంచి, ప్రాణము విడిచెను.

31. అది పాస్కపండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, “రేపటి విశ్రాంతి దినము గొప్పదినము. ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతినిండు" అని అడిగిరి.

32. కావున సైనికులు వెళ్ళి, యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటివాని కాళ్ళను, మరియొకని కాళ్ళను విరుగగొట్టిరి.

33. కాని వారు యేసువద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి, ఆయన కాళ్లు విరుగగొట్టలేదు.

34. అయితే, సైనికు లలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను.

35. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పి నది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును.

36. "ఆయన ఎముకలలో ఒకటైనను విరుగ గొట్టబడదు” అను లేఖనము ఇట్లు నెరవేరెను.

37. “వారు తాము పొడిచినవానివంక వీక్షిం తురు” అను మరియొక లేఖనము ఇట్లు నెరవేరెను.

38. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్లి, యేసు భౌతిక దేహమును ఈయగోరెను. యూదుల భయమువలన ఈ యోసేపు బహిరంగముగ గాక, రహస్యముగ యేసు శిష్యుడైయుండెను. పిలాతు అనుమతినొసగ అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసికొనిపోయెను.

39. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడ ఇంచుమించు నూట ఏబది సేర్ల బరువుగల పరిమళ ద్రవ్యమును, అత్తరును తీసికొని వచ్చెను.

40. వారు యేసు దేహమును తీసికొని, యూదుల భూస్థాపన సంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రముతో చుట్టిరి.

41. యేసు సిలువవేయబడిన చోట ఒక తోటగలదు. ఆ తోటలో ఎవ్వరును భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను.

42. అది విశ్రాంతిదినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను, ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి.