ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 9 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 9వ అధ్యాయము

 1. దేవుడు నోవాను, అతని కుమారులను దీవించి “పిల్లలతో, పాపలతో పెంపొంది భూమియందంతట వ్యాపింపుడు.

2. క్రూరజంతువులకు, ఆకాశమున విహరించుపక్షులకు, భూమిమీద నడయాడు ప్రతి ప్రాణికి, సముద్రమున సంచరించు చేపలకు మీరన్నచో బెదురుపుట్టును. వానిని మీ వశము చేసితిని.

3. భూమిమీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును. చెట్టుచేమలను ఇచ్చినట్లే, ఇప్పుడు ఈ ప్రాణులను గూడ మీకు అప్పగించుచున్నాను.

4. నెత్తుటిలో ప్రాణముండును. కనుక, మీరు జంతువుల మాంసమును తినునపుడు వాని నెత్తురు మాత్రము ముట్టుకొనరాదు.

5. నెత్తురు ప్రాణముతో సమానము. కావున నెత్తురు చిందించువారు జంతువులైనను, నరులైనను నాకు జవాబుదారులగుదురు. మనుష్యుని ప్రాణమునకు మనుష్యునినే బాధ్యునిగా చేసెదను.

6. దేవుడు తనను పోలిన వానినిగా మానవుని సృజించెను. అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెత్తుటిని గూడ నరుడే చిందించును.

7. పిల్లలతో, పాపలతో పెంపొందుడు. భూ మండలమంతట వ్యాప్తి చెందుడు” అనెను.

8-9. దేవుడు నోవాను, అతని కుమారులను చూచి “నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసికొనుచున్నాను.

10. ఓడనుండి వెలుపలికి వచ్చి మీతోపాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూరమృగములు - ఇంత ఎందులకు? మీ చెంతనున్న ప్రతి ప్రాణితో గూడ ఒడంబడిక చేసికొనుచున్నాను.

11. మీతోను ఒడంబడిక చేసికొనుచున్నాను. మరల ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు. భూమిని నాశనముచేయు నీటిముంపు తిరిగి ఏనాడును రాదు.

12. తరతరములవరకు నాకును, మీకును, మీతోపాటున్న ఈ ప్రాణులకును నడుమ ఈ ఒడంబడిక గుర్తును ఉంచుచున్నాను. .

13. నాకు, భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనుస్సును ఉంచు చున్నాను.

14. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును.

15. అపుడు నాకును, మీకును, ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసి కొందును. తిరిగి ఏనాడును జలములు పొంగి ప్రాణులను నాశనము చేయవు.

16. రంగుల ధనుస్సు మేఘములలో ఉండును. దానిని నేను చూచినప్పుడు దేవునకు, భూమిమీద జీవరాశికి నడుమ ఉన్న శాశ్వత నిబంధనమును గుర్తుచేసికొందును” అని అనెను.

17. దేవుడు నోవాతో “నాకు, భూమిమీది ప్రాణులకు నడుమ ఉన్న ఒడంబడిక గుర్తు ఇదే” అని అనెను.

18. షేము, హాము, యాఫెతు అను ముగ్గురు, ఓడనుండి వెలుపలికి వచ్చిన నోవాకుమారులు. హాము కనానుకు తండ్రి.

19. వీరు మువ్వురు నోవా కుమారులు, వారి సంతతి భూమండలమంతట వ్యాపించెను.

20-21. నోవా సేద్యముచేసి ద్రాక్షతోటలు వేయమొదలిడెను. అతడు ద్రాక్షరసము త్రాగి, కైపెక్కి గుడారములో దిగంబరుడుగా పడిపోయెను.

22. కనాను తండ్రియగు హాము, తండ్రి నగ్నముగా ఉండుట చూచి, వెలుపల ఉన్న తన ఇద్దరు సోదరులకు చెప్పెను.

23. షేము, యాఫేతు ఒక వస్త్రము తీసికొని, భుజములమీద వేసికొని, వెనుకకు అడుగులు వేయుచు వెళ్ళి, తండ్రి దిసమొలను కప్పిరి. వారు ముందువైపు మొగములు పెట్టియుండుటచే దిగంబరుడయిన తండ్రివైపు చూడలేదు.

24. మత్తు దిగిన తరువాత నోవా కడగొట్టుకొడుకు చేసిన పని తెలిసికొని యిట్లనెను: .

25. "కనాను శపితుడై సోదరులకు బానిసగునుగాక!”

26. అతడు ఇంక ఇట్లనెను: “మేము దేవుడగు యావే కొనియాడబడునుగాక! కనాను షేము బానిస అగునుగాక!

27. దేవుని దయవలన యాఫెతు వృద్ధిచెంది. షేము సంతతివారి నడుమ నివసించుగాక! కనాను వానికి బానిస అగునుగాక!”

28. జలప్రళయము తరువాత నోవా మూడు వందల యేబదియేండ్లు బ్రతికెను.

29. చనిపోవునాటికి అతని వయస్సు తొమ్మిదివందల యేబదియేండు.