ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 8 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 8వ అధ్యాయము

 1. నోవా, ఓడలో అతనితోపాటునున్న క్రూర మృగములు, పశువులు దేవునకు జ్ఞప్తికివచ్చెను. దేవుడు భూమిమీద గాలివీచునట్లు చేసెను. అంతట నీరుతీయుట మొదలయ్యెను.

2. అగాధజలముల ఊటలుతగెను. ఆకాశరంధ్రములు మూతపడెను. పైనుండి పడుచున్న వానవెలిసెను.

3. క్రమక్రమముగా భూమిమీది నుండి నీళ్ళు తీసిపోవుచుండెను. నూటయేబది రోజులు అయిన పిదప నీరు పూర్తిగా తగ్గేను.

4. ఏడవనెల పదునేడవ రోజున ఓడ అరారతులోనున్న కొండకొమ్మున నిలిచెను.

5. పదవనెలవరకు నీళ్ళు తగ్గుచు వచ్చెను. పదవనెల మొదటిరోజున కొండకొమ్ములు కనబడెను. .

6. నలువది రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరచెను. నీరు తగెనో లేదో తెలిసికొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను.

7. అది భూమి మీది నీరు ఇంకిపోవు వరకు అటునిటు తిరుగాడెను.

8. తరువాత నీళ్ళు తగ్గేనో లేదో తెలిసికొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను.

9. ఇంకను భూమిమీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటుకూడలేదు. అందుచే అది ఓడలో నున్న నోవా వద్దకే తిరిగివచ్చెను. నోవా చేయిచాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను.

10. మరియొక ఏడురోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను.

11. అది క్రొత్తగా త్రుంచిన ఓలివుచెట్టు రెమ్మను నోటకరచుకొని మాపటివేళకు వచ్చెను. భూమిమీది నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించుకొనెను.

12. అతడు మరియొక ఏడు రోజులు ఆగెను. మరల పావురమును వదలెను. అది తిరిగిరాలేదు.

13. ఆరువందల ఒకటవయేట మొదటి నెల మొదటిరోజున భూమిమీద ఉన్న నీరు అంతయు ఇంకిపోయెను. నోవా ఓడకప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరియుండెను.

14. రెండవనెల ఇరువది ఏడవ నాటికి నేల ఎండిపోయెను. నోవా ఓడనుండి దిగివచ్చుట

15-16. దేవుడు నోవాతో “నీవు నీ భార్య నీ కుమారులు కోడండ్రు మీరందరు ఓడనుండి వెలుపలికి రండు.

17. ఓడలో నీతో పాటున్న పక్షులను, జంతువులను, ప్రాకెడు పురుగులను, ప్రతిప్రాణిని వెలుపలికి తీసికొనిరమ్ము. అవి అన్నియు భూమిమీద విస్తరిల్లి, పిల్లలను కని, పెంపొందును” అని చెప్పెను.

18. భార్య, కొడుకులు, కోడండ్రతో నోవా వెలుపలికి వచ్చెను.

19. ఆయా జాతుల మృగములు, పశువులు, పక్షులు, ప్రాకెడు పురుగులు ఓడ నుండి వెలుపలికి వచ్చెను.

20. అప్పుడు నోవా దేవునికి బలిపీఠము నిర్మించెను. ఆయాజాతుల పవిత్ర జంతువులను, పక్షులను పీఠముపై దహనబలిగా సమర్పించెను.

21. బలి సుగంధమును ఆఘ్రాణించి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను: “యవ్వనప్రాయము నుండి మానవుని ఆలోచనములు దుష్టములు. అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడును శపింపను. ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను.

22. భూమి ఉన్నంతవరకు విత్తుట, కోయుట - వేడి, చలి , వేసవి, శీతలము - పగలు, రేయి యథావిధిగా కొనసాగునుగాక!”