ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 7 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 7వ అధ్యాయము

 1. దేవుడు నోవాతో “ఈ తరము వారిలో నీవు ఒక్కడవే నీతిమంతుడవు. కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు.

2. స్వచ్చమైన వానిలో ప్రతిజాతి వానిని ఏడుజంటల చొప్పున నీతోపాటు తీసికొని వెళ్ళుము. స్వచ్చముకాని అశుచికరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతిదానిని ఒక్కజంట చొప్పున కొనిపొమ్ము.

3. పక్షులలో ప్రతిజాతికి చెందిన వానిని ఏడు జంటలచొప్పున తీసికొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమిమీది ప్రాణులు నశింపవు.

4. ఇంక ఏడు రోజులకు భూమిమీద నలువదిపగళ్ళు, నలువది రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమిమీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండ చేయుదును” అనెను.

5. నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను.

6. భూలోకములో జలప్రళయము సంభవించినప్పుడు నోవా వయస్సు ఆరువందల యేండ్లు.

7. జలప్రళయము తప్పించుకొనుటకై నోవా తన భార్య, కొడుకులు, కోడండ్రతో ఓడలోనికి వెళ్ళెను.

8-9. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తినదగిన జంతువులలో, తినదగని జంతువులలో, ప్రాకెడు పురుగులలో, పక్షులలో ప్రతిజాతికి చెందినవి జతలు జతలుగా ఓడలోనున్న నోవా వద్దకు చేరెను.

10. అంతట ఏడు రోజులయిన తరువాత భూలోకములో జలప్రళయము సంభవించెను.

11. నోవాకు ఆరువందల యేండ్లు నిండి రెండు నెలల పదునేడవనాడు అగాధజలముల ఊటలన్ని బయటపడెను. ఆకాశమునకు చిల్లులు పడెను.

12. నలువది పగళ్ళు, నలువది రాత్రులు కుండపోతగా వానకురిసెను.

13. ఆనాడే షేము, హాము, యాఫెతు అను తన ముగురు కొడుకులతో, ముగ్గురు కోడండ్రలతో, భార్యతో నోవా ఓడలోనికి చేరెను.

14. ఆయాజాతుల మృగములు, పశువులు, పక్షులు, ప్రాకెడుపురుగులు ఒకటిగాదు అన్నియు

15. ఓడలోనున్న నోవావద్దకు వచ్చెను, జీవముగల ప్రతిప్రాణి జంట జంటలుగా వచ్చెను.

16. దేవుడు నోవాకు ఆజ్ఞాపించినట్టుగా అవి జంట జంటలుగా వచ్చి చేరెను. నోవా లోనికి వెళ్ళినపిదప దేవుడు ఓడ తలుపుమూసెను.

17. భూమిమీద నలువది రోజులపాటు నీటి ముంపు కొనసాగెను. నీరు ఉప్పొంగి ఓడను నేల మట్టము నుండి తేల్చెను.

18. నీరు నేలను ముంచి, పొంగి పొరలినపుడు ఓడ నీటిమీద తేలియాడెను.

19. ఆకాశము క్రిందనున్న ఉన్నత పర్వతములన్నియు మునిగిపోవువరకు, ఎడతెగకుండ నీరు ఉబికెను.

20. కొండలు పదునైదు మూరల లోతున ఉండునంతగా నీటిమట్టము పెరిగెను.

21. పక్షులు, పశువులు,  మృగములు, ప్రాకెడు పురుగులు, మానవులు, భూమి మీద నడయాడుచున్న ప్రతి ప్రాణియు నీటిపాలయ్యెను.

22. పొడినేల మీద ఉన్న ప్రతిజంతువు, ముక్కున ఊపిరియున్న ప్రతి ప్రాణి నాశమయ్యెను.

23. మానవుడుగావచ్చు, మృగముగావచ్చు, ప్రాకెడుపురుగు గావచ్చు, పక్షి గావచ్చు, మరింకేమయిన గావచ్చు దేవుడు ప్రతిప్రాణిని నాశనము చేసెను. సమస్త జీవరాశిని భూమిమీదనుండి తుడిచివేసెను. ఇక మిగిలినది ఓడలోనున్న నోవా, అతని పరివారము మాత్రమే.

24. నూట యేబది రోజులదాక భూమి మీద నీరు పొంగారెను. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services