ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 50 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 50వ అధ్యాయము

 1. యోసేపు తండ్రి ముఖముమీద వ్రాలి అతనిని ముద్దుపెట్టుకొని రోదించెను.

2. శవమును సుగంధ ద్రవ్యములతో చేర్పుడని అతడు తన కొలువున ఉన్న వైద్యులను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి.

3. నలుబది దినములు పూర్తి అయ్యెను. ఆ నలువది దినములలో వైద్యులు సుగంధ ద్రవ్యములతో శవమును భద్రపరచిరి. ఐగుప్తు దేశీయులు డెబ్బది రోజుల పాటు యాకోబుకొరకు అంగలార్చిరి.

4. దుఃఖ దినములు ముగిసిన తరువాత యోసేపు ఫరోరాజు కుటుంబము వారి వద్దకు వెళ్ళి “మీకు నామీద దయ గలదేని నా మాటగా ఫరోరాజుతో ఇట్లు మనవి చేయుడు:

5. 'నేను చనిపోవుచున్నాను. కనాను దేశములో నాకై నేను సిద్ధముచేసికొన్న సమాధిలో నన్ను పాతిపెట్టుము' అని చెప్పి మా తండ్రి నాచేత ప్రమాణము చేయించుకొనెను. సెలవైనచో అక్కడకి వెళ్ళి తండ్రిని పాతి పెట్టి తిరిగివత్తునని ఏలినవారితో చెప్పుడు” అనెను.

6. "ప్రమాణము చేసిన విధముగా వెళ్ళి తండ్రిని పాతి పెట్టుము” అని వరోరాజు సెలవిచ్చెను.

7. యోసేపు తండ్రిని సమాధి చేయుటకు వెళ్ళెను. ఫరో సేవకులు, రాజుఇంటి పెద్దలు, ఐగుప్తుదేశపు పెద్దలు, యోసేపు ఇంటివారు, అతని సోదరుల కుటుంబమువారు, తండ్రి కుటుంబమువారు, వీరందరును యోసేపు వెంటవెళ్ళిరి.

8. అతని సోదరులు తమ పిల్లలను, పశుమందలను, గొఱ్ఱెల మందలను మాత్రము గోషేను మండలములో విడిచి వెళ్లిరి.

9. రథములవారు, రౌతులు, అతనిని అనుసరించిరి. వీరందరు కూడి మహాజనసమూహమైరి.

10. యోర్దాను నదికి ఆవలి ప్రక్కనున్న ఆటాద్ కళ్ళము వద్దకు వచ్చినప్పుడు వారు గుండె బద్దలగునట్లు ఏడ్చిరి. అతడు తండ్రి కోసము ఏడు దుఃఖదినములను పాటించెను.

11. ఆటాద్ కళ్ళము దగ్గర వీరందరు ఇట్లు అంగలార్చుచుండగా, అక్కడకి సమీపమున నివసించుచున్న కనానీయులు చూచిరి. “ఐగుప్తు దేశీయులు ఎంత మిక్కిలిగా దుఃఖించుచున్నారు?” అని తమలో తాము అనుకొనిరి. అందుచేత వారు యోర్దానునది ప్రక్కనున్న ఆ ప్రదేశమునకు “ఆబెల్ మిస్రాయిమ్”' అను పేరు పెట్టిరి.

12. ఈ విధముగా యాకోబు చెప్పినట్లే అతని కుమారులు చేసిరి.

13. వారు అతనిని కనాను దేశమునకు కొనిపోయిరి. మక్పేలా పొలములో ఉన్న గుహలో అతనిని పాతి పెట్టిరి. శ్మశానముగా వాడుకొనుటకై అబ్రహాము ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రొను వద్దకొనెను. అది మమ్రేకు తూర్పున ఉన్నది.

14. తండ్రిని ఖననముచేసిన తరువాత యోసేపు సోదరులతో, అనుచరులతో తిరిగి ఐగుప్తు చేరెను.

15. తండ్రి చనిపోయిన పిదప యోసేపు సోదరులు భయపడి "యోసేపు మనమీద పగబట్టి మనముచేసిన కీడునకు తప్పక బదులు తీర్చుకొనును”

16. అందుచేత వారు యోసేపునకు ఇట్లు వర్తమానము పంపిరి.

17. “మరణింపకముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశము వినిపింపుడని మమ్ము కోరెను  'నీ సోదరులు నీకు కీడుచేసిరి. వారి దోషములను. అపరాధములను మన్నింపుమని కోరుచున్నాను. ” అందుచేత మేము మా తప్పులు క్షమింపుమని వేడుకొనుచున్నాము. మీ తండ్రి కొలిచిన దేవుడినే కొలుచుచున్న దాసుల మనవి ఇది.” వారి మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను.

18. అంతట అతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతనిఎదుట సాగిలబడి “ఇదిగో! మేము నీ బానిసలము" అనిరి.

19. కాని యోసేపు వారితో “భయపడకుడు. నేను దేవుడనా యేమి?

20. మీరు నాకు కీడు తలపెట్టితిరి. కాని దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహుప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించెను.

21. మీరేమి భయపడవలదు. నేను మిమ్మును, మీ పిల్లలను ఆద రింతును” అనెను. ఇట్లనుచు యోసేపు ప్రీతి పూర్వకముగా మాట్లాడి వారిని ఓదార్చెను.

22. తండ్రి కుటుంబమువారితోపాటు యోసేపు ఐగుప్తుదేశములో నివసించెను. అతడు నూటపది యేండ్లు బ్రతికెను.

23. యోసేపు ఎఫ్రాయీము పిల్లలను మూడవతరమువరకు చూచెను. మనష్షే కుమారుడగు మాకీరు పిల్లలనుకూడ ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను.

24. అతడు సోదరులతో “నేను మరణింపనుంటిని. దేవుడు మిమ్ము తప్పక ఆదు కొనును. ఆయన అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకే మిమ్ము కొనిపోవును” అనెను.

25. “దేవుడు మిమ్ము ఆదుకొని నపుడు ఈ దేశమునుండి నా అస్థికలను మీ వెంట కొనిపోవుడు” అని యోసేపు యిస్రాయేలు కుమారులచే ప్రమాణము చేయించుకొనెను.

26. యోసేపు నూట పదియవయేట చనిపోయెను. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిన అతని మృతదేహమును అతని సోదరులు ఐగుప్తుదేశమున ఒక శవపేటికయందు ఉంచిరి.