ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 47 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 47వ అధ్యాయము

 1. యోసేపు వచ్చి ఫరోరాజుతో “మా తండ్రి, సోదరులు కనానుదేశమునుండి వచ్చిరి. ఆలమందలతో గొఱ్ఱెలగుంపులతో సమస్తవస్తువులతో వచ్చి వారిపుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పెను.

2. పిదప అతడు తన సోదరులలో ఐదుగురిని ఫరోరాజు సముఖమునకు కొనివచ్చెను.

3. ఫరోరాజు “మీ వృత్తి యేమి?” అని వారినడిగెను. అంతటవారు “దొరా! మేము గొఱ్ఱెలకాపరులము. మా తాతముత్తాతలు కూడ మావంటివారే.

4. మేము ఈ దేశములో కొన్నాళ్ళపాటు బ్రతుకవచ్చితిమి. క్షామమునకు బలియైన కనానుదేశములో మందలకు మేతలేదు. గోషేను మండలములో మేముండుటకు దేవరవారు సెలవు దయచేయవలయునని, ఈ దాసులు వేడుకొనుచున్నారు” అనిరి.

5. ఫరోరాజు యోసేపుతో “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చిరన్నమాట!

6. ఈ ఐగుప్తుదేశమంతయు నీ ముందున్నది! సారవంతమైనచోటికి వారిని చేర్పుము. వారు గోపెనులో ఉండవచ్చును. వారిలో సమర్థులను మా మందలకు నాయకులుగా చేయుము” అనెను.

7. తరువాత యోసేపు తన తండ్రిని ఫరోరాజు సముఖమునకు గొనివచ్చెను. యాకోబు ఫరోరాజును దీవించెను.

8. “నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని?” అని ఫరోరాజు యాకోబును అడిగెను.

9. యాకోబు రాజుతో “నా ఇహలోకయాత్ర నూట ముప్పదియేండ్ల నుండి సాగుతున్నది. నాకు ఎన్నో ఏండ్లు లేవు. అవియును కష్టములతో గడిచిపోయినవి. మా తాతముత్తాతలు నాకంటె ఎక్కువయేండ్లే బ్రతికిరి” అని ప్రత్యుత్తరమిచ్చెను.

10. తరువాత యాకోబు ఫరోరాజును దీవించి, అతని సముఖమునుండి వెడలి పోయెను.

11. ఫరోరాజు ఆనతిచ్చినట్లే యోసేపు తండ్రికి, సోదరులకు ఐగుప్తు దేశములో ప్రశస్తమయిన రామెసేసు మండలమందలి భూము లిచ్చి నివాసములు ఏర్పరచెను.

12. అతడు తండ్రిని, సోదరులను, వారి కుటుంబములవారినందరిని వారి వారి లెక్కచొప్పున ఆహారమిచ్చి పోషించెను.

13. క్షామము దుర్బరముగానుండెను. దేశములో తిండి లేదు. కనానుదేశము, ఐగుప్తుదేశము దెబ్బతిన్నవి.

14. యోసేపు ఐగుప్తుదేశములో, కనాను దేశములో ధాన్యమును అమ్మగా వచ్చిన ద్రవ్యమును ప్రోగుచేసి ఫరోరాజు కోశాగారమునకు చేర్చెను.

15. ఐగుప్తుదేశములో కనాను దేశములో ఉన్న ద్రవ్యమంత వ్యయమైపోయినది. ఐగుప్తుదేశీయులు యోసేపుకడకువచ్చి “మా సొమ్మంతయు వ్యయమై పోయినది. మాకింత తిండి పెట్టుము. లేనిచో నీ కన్నులముందే మేముచత్తుము” అని మొరపెట్టుకొనిరి.

16. అంతట యోసేపు “మీ దగ్గర సొమ్ము లేక పోయిననేమి? మందలున్నవిగదా! వానిని నాకిచ్చి వేయుడు. మీకు ధాన్యమిచ్చెదను” అని చెప్పెను.

17. వారు మందలను తోలుకొని వచ్చి యోసేపు వశము చేసిరి. గుఱ్ఱములను, గొఱ్ఱెల గుంపులను, ఆలమందలను, గాడిదలను వశముచేసికొని వానికి బదులుగా యోసేపు ధాన్యమిచ్చెను. మందలకు బదులుగా ధాన్యమిచ్చి అతడు ఆయేడు వారిని పోషించెను.

18. ఆ యేడు గడచిపోయినది. వారు మరుసటియేడు కూడ వచ్చి “దొరా! నీదగ్గర కప్పిపుచ్చుట ఎందులకు? మా సొమ్ము అంతయు వ్యయమైపోయినది. మా మందలు మీ వశమైనవి. మేము, మా భూములు తప్ప ఇంకేమియు మిగులలేదు.

19. మీరు చూచు చుండగనే మేము, మాభూములును నాశనముగానేల? ధాన్యమిచ్చి మమ్మును, మా భూములను కొనుడు. మా భూములు ఫరోరాజునకు దక్కును. మేము వారికి దాసులము అగుదుము. మేము చావకుండుటకును, మా పొలములు బీళ్ళు కాకుండుటకును మాకు విత్తనములిండు” అనిరి. .

20. కావున యోసేపు ఐగుప్తుదేశములో ఉన్న భూములన్నింటిని ఫరోరాజు పేరిట కొనెను. కరువు దారుణముగా ఉండుటచే ఐగుప్తు దేశీయులు తమ భూములనన్నింటిని విక్రయించిరి. ఈ రీతిగా భూము లన్నియు ఫరోరాజు వశమైనవి.

21. ఐగుప్తు దేశము పొలిమేరలలో ఆ చివరనుండి ఈ చివరివరకు అతడు ప్రజలను బానిసలుగా చేసెను.

22. యోసేపు యాజకుల భూములను కొనలేదు. వారికి ఫరోరాజు బత్తెములిచ్చుచుండెను. వారు ఆ బత్తెముల మీద బ్రతుకుచుండిరి. కావున వారికి భూములు అమ్మ వలసిన అక్కర కలుగలేదు.

23. అంతట యోసేపు ప్రజలతో “నా మాట వినుడు. ఈనాడు మిమ్మును మీ భూములను ఫరోరాజు పేరిటకొంటిని. ఇవిగో! విత్తనములు. వీనిని పొలములో విత్తుడు.

24. పండిన పంటలో ఐదవవంతు ఫరోరాజునకు సమర్పింపుడు. మిగిలిన నాలుగు వంతుల పంట విత్తనములు కట్టుటకు, మీరు మీ పిల్లలు మీ కుటుంబమువారు తిండితినుటకు మీకే చెందును” అనెను.

25. ప్రజలు అతనితో “మీరు మా ప్రాణములు కాపాడితిరి. మీరు అనుగ్రహించిన మేము ఫరోరాజుకు బానిసలమగుదుము” అనిరి.

26. ఈ రీతిగా వండినపంటలో ఐదవవంతు వరోరాజునకు చెందవలెనని యోసేపు కట్టడచేసెను. అది ఈనాటికిని అమలులో ఉన్నది. యాజకుల భూములు మాత్రము ఫరోరాజు కైవసము కాలేదు.

27. యిస్రాయేలీయులు ఐగుప్తుదేశమునందలి గోషేను మండలములో నివసించిరి. అక్కడ వారు భూములు సంపాదించిరి, బిడ్డలతో, గొడ్డుగోదలతో మిక్కిలి పెంపొందిరి,

28. యాకోబు పదునేడేండ్లు ఐగుప్తుదేశములో నివసించెను. అతడు నూట నలుబది ఏడేండ్లు బ్రతికెను.

29. మరణసమయము సమీ పించినప్పుడు అతడు యోసేపును పిలచి “నాయనా! నా తొడక్రింద నీ చేయి పెట్టుము. నా పట్ల దయావిశ్వాస ములు చూపుము. నన్ను ఐగుప్తుదేశములో పాతి పెట్టవలదు.

30. నా తాతముత్తాతలవలె నేను మరణించిన తరువాత, నన్ను ఇక్కడ నుండి తీసికొని పోయి మన భూమిలో వారిసరసనే పాతి పెట్టుము” అనెను. "తండ్రీ! నీవు చెప్పినట్లే చేయుదును” అని యోసేపు అనెను.

31. యాకోబు “అట్లని ప్రమాణము చేయుము” అనెను. యోసేపు ప్రమాణము చేసెను. వెంటనే యిస్రాయేలు మంచము తలగడమీద వ్రాలిపోయెను.