ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 46 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 46వ అధ్యాయము

 1. యిస్రాయేలు తనకున్నదంత బేర్షెబాకు వచ్చెను. అచట తనతండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను.

2. రాత్రివేళ దర్శనములో దేవుడు “యాకోబూ! యాకోబూ!” అని పిలిచెను. యాకోబు “చిత్తముప్రభూ!” అనెను.

3. అప్పుడు దేవుడు “నేను ప్రభుడను. నీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తుదేశము వెళ్ళుటకు భయపడకుము. అచ్చట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును.

4. నీతోపాటు నేనును ఐగుప్తుదేశమునకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసికొనివత్తును. నీవు మరణించునపుడు యోసేపు నీ కన్నులు మూయును” అని చెప్పెను.

5. అంతట యాకోబు బేర్పెబా నుండి బయలుదేరెను. యిస్రాయేలు కుమారులు తమ తండ్రి యాకోబును భార్యాపిల్లలను ఫరోరాజు పంపిన బండ్లమీది కెక్కించిరి.

6. కనానులో గడించిన మందలను, వస్తుసామగ్రిని ప్రోగుచేసికొని యాకోబు, అతని సంతతి ఐగుప్తుచేరెను.

7. యాకోబు తన కుమారులను, కుమార్తెలను, మనుమలను, మనుమరాండ్రను యావత్సంతతిని తనతోపాటు ఐగుప్తుదేశమునకు కొనివచ్చెను.

8. ఐగుప్తుదేశమున ప్రవేశించిన యిస్రాయేలు పిల్లల పేర్లు ఈ క్రింది విధముగా ఉన్నవి. యాకోబు, అతని కుమారులు: యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను.

9. హనోకు, పల్లు, హెస్రోను, కర్మి అనువారు రూబేను కుమారులు.

10. యమూవేలు, యామీనులు, ఓహాదు, యాకీను, సోహరు, కనానీయురాలి కుమారుడైన దింపవచ్చును. షావులు అనువారు షిమ్యోను కుమారులు.

11. అవి కుమారులైన గెర్షోను, కోహాతు, మెరారి.

12. ఎరు, ఓనాను, షేల, పెరెసు, సెరా అనువారు యూదా కుమారులు. వీరిలో ఎరు, ఓనాను కనానుదేశమందే మరణించిరి. పెరెసుకుమారులైన ఎస్రోను, హామూలు.

13. యిస్సాఖారు కుమారులైన తోలా, పువా, యోబు, సిమ్రోను.

14. సెబూలూను కుమారులైన సెరెదు, ఏలోను,  యాహ్లేలు.

15. వీరందరును లేయా పుత్రులు. ఆమె యాకోబునకు పద్దనారాములో వీరిని కనెను. వారికొక కుమార్తెయు కలదు. ఆమె పేరు దీనా. యాకోబు కుమారులు కుమార్తెలు మొత్తము ముప్పది ముగ్గురు.

16. సిఫియోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, ఆరేలి అనువారు గాదు కుమారులు.

17. ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా అనువారు ఆషేరు కుమారులు. వీరి సోదరి సేరా.

18. బెరెయా కుమారులైన హెబెరు, మాల్కీయేలు. లాబాను తన కుమార్తె లేయాకు దాసిగా ఇచ్చిన జిల్పా సంతతివారు వీరు. ఈమె ఈ పదునారుమందిని యాకోబునకు కనెను.

19. యోసేపు, బెన్యామీను అనువారు రాహేలు కుమారులు.

20. మనష్షే, ఎఫ్రాయీము అనువారు ఐగుప్తుదేశములో యోసేపునకు పుట్టిరి. ఓను నగర పురోహితుడైన పోతీఫెర కుమార్తె ఆస్నతు వారిని కనెను.

21. బేలా, బేకెరు, అస్బెలు, గేరా, నామను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, ఆర్డు అనువారు బెన్యామీను కుమారులు.

22. వీరందరు రాహేలు సంతతి. ఆమెకు, యాకోబునకు జన్మించిన వీరు మొత్తము పదునలుగురు.

23. దాను కుమారుడైన హషీము.

24. యహసేలు, గుని, యేజరు, షిలేము అనువారు నఫ్తాలి కుమారులు.

25. వీరందరు లాబాను తన కుమార్తెయైన రాహేలు నకు దాసిగా ఇచ్చిన బిలా సంతతివారు. ఆమె ఈ ఏడుగురిని యాకోబునకు కనెను.

26. యాకోబుతోపాటు ఐగుప్తు దేశమునకు వచ్చిన అతని కుమారులు మొత్తము అరువది ఆరుగురు. ఈ లెక్కలో అతని కుమారుల భార్యలు చేరలేదు.

27. ఐగుప్తు దేశములో యోసేపునకు ఇద్దరు కుమారులు పుట్టిరి. ఈ విధముగా ఐగుప్తు దేశములో ప్రవేశించునాటికి యాకోబు కుటుంబము వారందరు మొత్తము డెబ్బదిమంది.

28. గోషేనులో యోసేపును కలిసికొనుటకై యాకోబు యూదాను పంపెను. పిదప వారు గోషెను చేరిరి.

29. యోసేపు రథము సిద్ధము చేయించుకొని తండ్రిని చూచుటకై గోషేను వెళ్ళెను. తండ్రిని కలసి కొని అతని మెడ పై వ్రాలి, ఎంతో సేపు ఏడ్చెను.

30. యిస్రాయేలు యోసేపుతో “నాయనా! బ్రతికి బట్టగట్టు కొనుచున్న నిన్ను కన్నులార చూచితిని. ఇక నేను చీకుచింతలేకుండ చనిపోయెదను” అనెను.

31. అంతట యోసేపు తన సోదరులను తండ్రి పరివారమును చూచి “ఇక నేను వెళ్ళి ఫరోరాజుతో కనాను దేశములోనున్న మా సోదరులు మా తండ్రి కుటుంబము వారందరు నా దగ్గరకు వచ్చిరి.

32. వారు గొఱ్ఱెల కాపరులు. వారికి ఆలమందలు గొఱ్ఱెగుంపులు కలవు. ఆలమందలతో తమకున్న ఇతర సంపదలతో వారు వచ్చిరని చెప్పెదను.

33. కావున ఫరోరాజు పిలిపించి మీ వృత్తేమి? అని ప్రశ్నించిన,

34. ప్రభూ! మా తాత ముత్తాతల మాదిరిగా మేము చిన్ననాటినుండి గొఱ్ఱెల కాపరులమే అని చెప్పుడు. అప్పుడు మీరు గోషేనులో స్థిరపడవచ్చును. ఈ ఐగుప్తు దేశీయులు గొఱ్ఱెలకాపరులను హేయముగా చూతురు” అని అనెను.