ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 41 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 41వ అధ్యాయము

 1. రెండేండ్ల తరువాత ఫరోప్రభువు ఒక కల కనెను. అతడు నైలునది ఒడ్డున నిలుచుండెను.

2. ఇంతలో ఏడు ఆవులు నదినుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను. అవి కండపట్టి చూడచక్కగానుండెను.

3. కొంతసేపటికి మరి ఏడు ఆవులు నది నుండి పైకివచ్చెను. అవి బక్కచిక్కి వికారముగా నుండెను. అవి యేటి ఒడ్డుననే మొదట వచ్చిన ఆవుల సరసన నిలబడెను.

4. బక్కచిక్కి వికారముగానున్న ఆవులు, కండపట్టి చక్కగా ఉన్న ఆవులను తినివేసెను. అంతట ఫరోరాజు. మేల్కొనెను.

5. అతడు మరల నిద్రపోయెను. మరల ఒక కలకనెను. కలలో ఒక దంటుకు ఏడు మంచి పుష్టిగల కంకులు పుట్టుటచూచెను.

6. వాని తరువాత ఏడు సన్నని పీలకంకులు పుట్టెను. అవి తూర్పుగాలి వీచుట చేత యెండిపోవుచుండెను.

7. ఈ పీలకంకులు గట్టి కంకులను మ్రింగివేసెను. ఫరోప్రభువు మేల్కొని అది కలయని గ్రహించెను.

8. తెల్లవారిన తరువాత అతని మనస్సు కలవర పడెను. ఫరోరాజు ఐగుప్తుదేశములో ఉన్న సర్వ మంత్రగాండ్రను, సమస్తజ్ఞానులను పిలిపించి, వారికి తన కలలను గూర్చి చెప్పెను. కాని వారిలో స్వప్న ఫలములను వివరించు వాడొక్కడును లేడాయెను.

9. అంతట ముఖ్య పానీయవాహకుడు తన యేలికతో “ఈ నాటికి నేను చేసిన తప్పులు నాకు తెలిసి వచ్చినవి.

10. ఒకసారి ఏలినవారు దాసులమీద కోపపడితిరి. అప్పుడు నన్నును, ముఖ్యవంటవానిని అంగరక్షకనాయకుని అధీనమునందుంచి చెరసాలలో వ్రాయించిరి.

11. ఒకరాత్రి మేమిరువురము కలలు గంటిమి. అవి వేరువేరు భావములు కలవి.

12. చెరసాలలో మాతో పాటు ఒక హెబ్రీయ పడుచువాడు ఉండెను. అతడు అంగరక్షకనాయకుని సేవకుడు. మేమతనికి మా కలలు చెప్పుకొంటిమి.

13. అతడు చెప్పినట్టే మా కలలు నిజములైయినవి. నాకు కొలువు దొరికినది, వంట వానిని ఉరితీసిరి.”

14. ఫరోరాజు యోసేపును పిలువనంపెను. సేవకులు అతనిని. శీఘ్రముగా కొనివచ్చిరి. అతడు క్షౌరముచేయించుకొని మంచి ఉడుపులు తాల్చి ఫరో ప్రభువు సముఖమునకు వచ్చెను.

15. ప్రభువు అతనితో “నేను ఒక కలకంటిని. దాని ఫలమును తెలియజేయువాడొక్కడును కనబడుటలేదు. నీవు స్వప్నార్ధములను వివరింపగలవని వింటిని” అనెను.

16. దానికి యోసేపు “నేనెంతవాడను? ఏలినవారికి మేలు కలుగునట్లుగా దేవుడే చెప్పగలడు” అని బదులు చెప్పెను.

17. అంతట ఫరోరాజు యోసేపుతో ఇట్లు చెప్పెను: “కలలో నేను నైలునది ఒడ్డున నిలబడితిని.

18. కండపట్టి చూడచక్కగానున్న ఏడు ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను.

19. తరువాత బక్కచిక్కి వికారముగానున్న మరి ఏడు ఆవులు పైకి వచ్చెను. ఇట్టి బక్క ఆవులను నేను ఐగుప్తు దేశమున ఎన్నడును, ఎచ్చటను చూచియెరుగను.

20. బక్కచిక్కి వికారముగానున్న ఆవులు మొదట వచ్చిన మంచి ఆవుల ఏడింటిని తినివేసెను.

21. అయినప్పటికి వాని కడుపులో కండపట్టిన ఆవులు ఉన్నట్లెవడును కనుగొనలేదు. బక్కచిక్కిన ఆవులెప్పటి మాదిరిగనే ఉండెను. నేనప్పుడు మేల్కొంటిని.

22. తిరిగి నిద్రపోతిని. మరియొక కలగంటిని. ఒక దంటుకు ఏడు మంచి పుష్టిగల కంకులు పుట్టుట చూచితిని.

23. వాని తరువాత తూర్పుగాలి తగిలి యెండి, మాడిపోయిన ఏడు పీలకంకులు పుట్టెను.

24. ఈ పీలకంకులు గట్టికంకులను ఏడింటిని మ్రింగివేసెను. నేను దీనినంతయు శాకునికులతో చెప్పితిని. కాని వివరించువాడు ఎవ్వడును కనబడలేదు.”

25. అంతట యోసేపు “దేవరవారు కన్న కలలు రెండునూ ఒక్కటియే. దేవుడు తాను చేయబోవు పనిని ఏలినవారికి తెలియచేసెను,

26. మంచి ఆవులు ఏడును ఏడుసంవత్సరములు. అట్లే మంచికంకులు ఏడును ఏడేండ్లు, కల ఒక్కటియే,

27. మంచి ఆవుల తరువాత పైకి వచ్చిన బక్కచిక్కి వికారముగానున్న ఆవులు ఏడును ఏడేండ్లు. తూర్పుగాలి తగిలి మాడి పోయిన ఏడు పీలకంకులు ఏడు కరువుయేండ్లు.

28. నేను చెప్పినట్లు దేవుడు తాను చేయబోవు పనిని ఏలినవారికి తెలియచేసెను.

29. మొదట ఏడేండ్లు ఐగుప్తుదేశమంతట పుష్కలముగా పంటలుపండును.

30. తరువాత ఏడేండ్లు దేశమంతట భయంకర క్షామము సంభవించును. దీనివలన ఐగుప్తు దేశము నందలి ప్రజలెల్లరు మొదటి ఏడేండ్ల సమృద్ధిని మరచిపోవుదురు. ఆ కరువు వలన దేశము మలమల మాడిపోవును.

31. రానున్న కరువు మహాదారుణమైనది. కావున సుభిక్షముగా సాగిపోయిన యేండ్లను ఈ దేశీయులెవ్వరును స్మరింపరు.

32. ఈ విపత్తు కలుగవలెనని దేవుడు ఇదివరకే సంకల్పించెను. ఇక అచిరకాలముననే దానిని కలిగించితీరును. రెండు కలలువచ్చుటకు హేతువు ఇదియే.

33. అందుచేత ఏలినవారు వెంటనే వివేకశీలి, ఉపాయశాలి అగువానినన్వేషించి, దేశమును అతని వశము కావింపవలయును.

34. అంతేకాదు. దేశమునందంతట అధికారులను నియమింపవలయును. పుష్కలముగా పంటలుపండు ఏడేండ్ల కాలములో, పంటలో ఐదవవంతు సేకరింపవలయును.

35. ఈ విధముగా సుభిక్షములైన ఏడేండ్లలో లభించు పంటనంతయును ప్రోగుచేయవలయును. ప్రోగుచేసినపంటను ఏలినవారి వశముచేసి నగరములో భద్రపరుపవలయును.

36. అది. ఐగుప్తు దేశమున కరువు తాండవించు ఏడేండ్లు గుప్తాహారముగా ఉండును. ఇట్లు చేసినచో దేశము క్షామమునకు బలిగాదు” అని వక్కాణించెను.

37. ఇది విని ఫరోరాజు అతని కొలువువారు సంతసించిరి.

38. అతడు యోసేపును చూపి వారితో “దేవుని ఆత్మగల ఇట్టి మానవుని మరొకనిని మనము చూడగలమా?" అనెను.

39. తరువాత అతడు యోసేపుతో “ఇది అంతయు దేవుడు నీకెరుకపరిచెను. కావున నీ వంటి ఉపాయజ్ఞుడు, వివేకి వేరోకడు లేడు.

40. నా ఇంటి పెత్తనమంతయు నీదే. నా ప్రజలందరు నీ మాటకు కట్టువడియుందురు. ఒక్క సింహాసనము విషయమున మాత్రమే నేను నీ కంటెను అధికుడను.

41. ఇదిగో! నేటినుండి నిన్ను ఐగుప్తుదేశమునకు సర్వాధికారిగా నియమించుచున్నాను” అని చెప్పెను.

42. ఇట్లు చెప్పి తనచేతనున్న రాజాంగుళీకమును యోసేపు చేతికి పెట్టెను. ధరించుటకు పట్టువస్త్రముల నిచ్చెను. మెడలో బంగారు గొలుసు వేసెను.

43. అతనిని రాజరథమునకు సాటియైన మరియొక రథము ఎక్కించి వాడవాడల త్రిప్పించెను. సేవకులు రథము ముందుండి 'ఇతనికి నమస్కరించుడు' అని కేకలువేసిరి. ఈ విధముగా యోసేపును ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించి ఫరోరాజు.

44. “ఇదిగో! ఫరోనైన నేను చెప్పుచున్నాను. వినుము. ఈ ఐగుప్తుదేశమున నీ అనుమతి లేకుండ ఏ ఒక్కడును కాలుచేయి కదల్పడు” అనెను.

45.పిదప యోసేపునకు జఫెనత్పానెయా అను మారుపేరు పెట్టెను. అతనికి ఓను పట్టణ పురోహితుడైన పోతీఫెర కుమార్తెయగు ఆస్నతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు ఐగుప్తుదేశము నందంతట తిరిగెను.

46. ఫరోరాజు కొలువులో చేరిననాటికి యోసేపు వయస్సు ముప్పదియేండ్లు. అతడు రాజు సెలవు తీసికొని దేశమునందంతట పర్యటించెను.

47. ఏడేండ్లు పుష్కలముగా పంటలుపండినవి.

48. యోసేపు దేశమున పండిన పంటనంతయు సేకరించెను. దానిని పట్టణములో నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునున్న పొలములలో పండిన పంటను ఆ పట్టణమునందే భద్రపరిచెను.

49. అతడు పెద్ద పెద్ద మొత్తములలో ధాన్యమును నిలువచేసెను. సముద్రపు ఇసుక తిప్పలవలె ధాన్యరాసులు పెరిగినవి. అవి కొలతల కందనివి కనుక అతడు వానిని కొలువలేక పోయెను.

50. కరువు వచ్చుటకు ముందు యోసేపునకు ఆస్నతువలన ఇద్దరు కుమారులుపుట్టిరి. ఆస్నతు ఓనుపట్టణ పురోహితుడైన పోతీ ఫెర కుమార్తె.

51. దేవుడు నన్ను కన్నవారిని, నా కష్టములను మరచిపోవునట్లు చేసెనని యోసేపు పెద్దకుమారునికి 'మనష్షే' అను పేరు పెట్టెను.

52. నేను కష్టముల పాలైన దేశమునందే దేవుడు నాకు వృద్ధినిచ్చెనని రెండవ కుమారునకు 'ఎఫ్రాయీము" అను పేరు పెట్టెను.

53. యోసేపు చెప్పినట్లు సమృద్ధిగా పంటలు పండిన ఏడేండ్లు కడచిన తరువాత ఏడేండ్లపాటు కరువు వచ్చెను.

54. ప్రతిదేశమున క్షామము సంభవించినది. కాని ఐగుప్తు దేశములో మాత్రము కావలసినంత తిండి దొరకినది.

55. ఐగుప్తు  దేశమందంతట కరువురాగా ప్రజలు ఫరోరాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు "యోసేపు దగ్గరకు వెళ్ళుడు. ఆయన చెప్పినట్టు చేయుడు” అని వారిని ఆజ్ఞాపించెను.

56. దేశము నాలుగుచెరగుల కరువు తాండవించుచున్నది. కనుక యోసేపు ధాన్యపు గిడ్డంగులను తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను.

57. ప్రతి దేశమున క్షామము దుర్బరముగా ఉండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపువద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తుదేశమునకు వచ్చిరి.