1. అప్పుడు యూదా సోదరులను వీడి వెళ్ళి పోయెను. అతడు హీరా అనునొక అదుల్లామీయుని దగ్గర నివసింపమొదలిడెను.
2. అక్కడ యూదా కనానీయుడైన షూవ కుమార్తెను చూచెను. ఆమెను పెండ్లియాడి ఆమెతో సంసారము చేసెను.
3.. ఆమె గర్భము ధరించి కొడుకును కనెను. అతనికి 'ఏరు' అను పేరు పెట్టెను.
4. రెండవసారి ఆమె గర్భవతియై కుమారుని కని అతనికి 'ఓనాను' అను పేరు పెట్టెను.
5. మూడవసారి కూడ ఆమె గర్భవతియై ఒక కుమారుని కని, అతనికి 'షేలా' అను పేరు పెట్టెను. ఆమె మూడవ కుమారుని కన్నప్పుడు కేసిబులో ఉండెను.
6. యూదా పెద్దకుమారుడు ఏరుకు తామారు అను ఆమెను ఇచ్చి పెండ్లి చేసెను.
7. దేవుని కంటికి ఏరు చెడ్డవాడాయెను. అందుచే దేవుడతనిని చంపివేసెను.
8. అప్పుడు యూదా రెండవ కుమారుడగు ఓనానుతో “మీ వదినెను స్వీకరించి మరిది ధర్మము నెరవేర్చి మీ అన్నకు సంతానమును కలిగింపుము” అని చెప్పెను.
9. అట్టి సంతానము తనది కానేరదని ఓనానునకు తెలియును. వదినెను కూడినపుడెల్ల ఆమెకు సంతానము కలుగకుండునట్లుగా అతడు రేతస్సును భూమిపై విడిచెడివాడు.
10. దేవుని కంటికి ఓనాను చేసిన పని చెడ్డదయ్యెను. అందుచే దేవుడు వానిని కూడ చంపివేసెను.
11. అంతట యూదా కోడలు తామారుతో “మూడవ బిడ్డడగు షేలా పెరిగి పెద్దవాడగు వరకు నీవు నీ పుట్టినింట వితంతువుగనే ఉండుము” అని చెప్పెను. షేలాకు కూడ అన్నల గతిపట్టునని యూదా భయపడి ఈ పన్నాగము పన్నెను. తామారు వెళ్ళి పుట్టినింటిలో నుండెను.
12. కాలము గడచినది. యూదా, భార్యగా స్వీకరించిన షూవ కుమార్తె మరణించెను. దుఃఖ దినములు ముగిసిన తరువాత యూదా తన స్నేహితుడైన అదుల్లామీయుడగు హీరాతో కలిసి తన గొఱ్ఱెల ఉన్ని కత్తిరించువారిని చూచుటకు తిమ్నాతు వెళ్ళెను.
13. మామ గొఱ్ఱెల ఉన్ని కత్తెర వేయించుటకు తిమ్నాతు 'వెళ్ళుచున్నాడని తామారునకు తెలిసినది.
14. షేలా , పెద్దవాడయ్యెనని ఆమెకు తెలియును. మామ తన్నింకను అతనికి భార్యగా అర్పింపడయ్యెను. కనుక ఆమె విధవ వస్త్రములను వదలినది. మొగమున మేలిముసుగు దాల్చి ఒడలు కప్పుకొనినది. తిమ్నాతు పోవు త్రోవచీలి ఎనాయిమునకు పోవుచోట కూర్చున్నది.
15. యూదా, ఆమెను చూచెను. మేలిముసుగు దాల్చియున్నందున అతడు ఆమెను వెలయాలిగా తలంచెను.
16. బాటప్రక్కనే కూర్చున్న ఆమె చెంతకు పోయికోడలని గుర్తింపజాలక “నాతో వత్తువా?” అని అడిగెను. దానికామె “యేమిత్తువు?” అని ప్రశ్నించెను.
17. అతడు "నా మందనుండి మేకపిల్లను పంపెదను” అనెను. “మేకపిల్లను పంపువరకు ఏమైన కుదువ బెట్టెదవా?” అని ఆమె అడిగెను.
18. “ఏమి కుదువ బెటవలయునో నీవే చెప్పుము” అని అతడు కోరెను. దానికామె “నీముద్రికను, నీ త్రాటిని, నీచేతికఱ్ఱను కుదువబెట్టుము” అని చెప్పెను. యూదా వానిని ఇచ్చి ఆమెను కూడెను. ఆమె గర్భము ధరించెను.
19. అంతట ఆమె ఇల్లు చేరుకొనెను. మేలిముసుగు తొలగించి, మునుపటి విధవవస్త్రములు ధరించెను.
20. తరువాత యూదా కుదువబెట్టిన సొమ్మును తీసికొనుటకై మిత్రుడు అదుల్లామీయునికి మేకపిల్లను ఇచ్చిపంపెను. కాని ఆమె అదుల్లామీయునకు కనబడలేదు.
21. "త్రోవలో ఎనాయిము నొద్ద కూర్చుండెనే! ఆ వెలయాలు ఎక్కడ ఉన్నది?" అని అతడు అక్కడివారిని అడిగెను. వారు “ఇక్కడ వెలయాలు యెవ్వతెయులేదే” అనిరి.
22. అదుల్లామీయుడు వెనుదిరిగి వెళ్ళి యూదాతో “ఆమె కనబడలేదు. పైగా అక్కడివారు ఈ తావున వెలయాలు యెవ్వతెయు లేదనిరి” అని చెప్పెను.
23. యూదా అతనితో “ఆమెనే ఆ వస్తువులనుంచుకొననిమ్ము. ఇరుగు పొరుగువారు విన్న మనకు నగుబాటగును. అనుకొన్న మాట ప్రకారముగా నేను మేకపిల్లను పంపితిని. ఆమె నీకు కనబడదాయెను” అనెను.
24. మూడునెలలు తరువాత ఎవ్వరో “నీ కోడలు వెలయాలివలె బ్రతికినది. తప్పుత్రోవ తొక్కిన ఆమె గర్భము దాల్చినది” అని యూదాతో చెప్పిరి. అతడు మండిపడి “ దానిని నలుగురిలోనికి ఈడ్చుకొని వచ్చి నిలువున కాల్చివేయుడు” అనెను.
25. జనులామెను బయటికి కొనివచ్చిరి. బయటికి వచ్చిన తరువాత ఆమె మామను పిలువనంపి ఈ వస్తువులెవనివో అతని వలననే నేను గర్భవతినైతిని. ఈ ముద్రికను, ఈ త్రాడును, ఈ చేతికఱ్ఱను చూడుము. దయచేసి ఇవెవనివో చెప్పుము” అనెను.
26. యూదా వానిని గుర్తుపట్టి “ఈమె నాకంటె నీతిమంతురాలు. ఈమెను షేలాకు అప్పగింపనైతిని” అనెను. తరువాత అతడు ఎన్నడును తిరిగి ఆమెను కూడలేదు.
27. ప్రసవ సమయమున ఆమె గర్భమునందు కవలపిల్లలు ఉండిరి.
28. ఆమె ప్రసవవేదన పడుచున్నప్పుడు వారిలో ఒకడు బయటికి చేయిచాచెను. మంత్రసాని ఎఱ్ఱనూలుతీసి వానిచేతికి కట్టి “వీడే మొదటివాడు” అనెను.
29. ఆ శిశువు చేతిని వెనుకకు లాగుకొనిన వెంటనే వానితమ్ముడు బయటికివచ్చెను. అంతట మంత్రసాని “ఇదేమి? నీవు ఎట్లు బయటపడితివి?" అనెను. అందుచే అతనికి 'పెరెసు' అను పేరు పెట్టిరి.
30. తరువాత చేతికి తొగరునూలున్న శిశువు బయటికి వచ్చెను. అతనికి సెరా' అను పేరు పెట్టిరి.