ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 35 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 35వ అధ్యాయము

 1. దేవుడు యాకోబుతో “నీవు లేచి, బేతేలునకు వెళ్ళి అచట స్థిరపడుము. నీవు నీ సోదరుడు ఏసావు బారినపడక తప్పించుకొని పారిపోవు చున్నపుడు, నీకు ప్రత్యక్షమయిన దేవునకు అక్కడ ఒక బలిపీఠమును నిర్మింపుము” అనెను.

2. కావున యాకోబు ఇంటివారితో, తనతో ఉన్నవారితో “మీ దగ్గర ఉన్న అన్యదేవతా విగ్రహములను పారవేయుడు, మిమ్మల్ని మీరు శుద్ధిచేసికొని, మైలబట్టలు మార్చు కొనుడు.

3. మనము బేతేలునకు వెళ్ళుదము. ఇక్కట్లు చుట్టిముట్టిననాడు నా మొరాలకించిన దేవునకు, నేను వెళ్ళిన త్రోవపొడుగున నన్ను వేయికన్నులతో కాపాడిన దేవునకు ఒక బలిపీఠము నిర్మింతును” అనెను.

4. వారందరు తమ దగ్గరనున్న దేవతా విగ్రహ ములను చెవిపోగులను యాకోబునకు అప్పగించిరి. అతడు వానినన్నిటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టెను.

5. తరువాత వారు బయలుదేరిరి. దేవునిభయము చుట్టుపట్టులనున్న నగరములపై కొచ్చెను. అక్కడి వారు యాకోబు కుమారులను వెంటాడుటకు సాహసింపలేదు.

6. యాకోబు, అతనివెంట ఉన్నవారందరు కనాను దేశమందలి లూజునకు వచ్చిరి. అదే బేతేలు.

7. అక్కడతడు ఒక బలిపీఠమును నిర్మించెను. సోదరుని బారిబడక, తప్పించుకొని పారిపోవుచున్న తనకు, ఆ చోట దేవుడు ప్రత్యక్షమయ్యెను. కావున, అతడు దానికి 'ఎల్ బేతేలు' అను పేరు పెట్టెను.

8. అప్పుడు రిబ్కా దాది దెబోరా చనిపోయెను. యాకోబు ఆమెను బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టెను. కావున ఆ చోటికి "అల్లోన్ బొకుత్' అనుపేరు వచ్చెను.

9. పద్దనారాము నుండి వచ్చిన తరువాత దేవుడు మరల యాకోబునకు ప్రత్యక్షమై అతనిని దీవించెను.

10. దేవుడు అతనితో నీ పేరు యాకోబు. ఇకనుండి నీకు యాకోబు అను పేరుండదు. నీకు 'యిస్రాయేలు' అను పేరు చెల్లును అనెను. కావున అతనికి యిస్రాయేలు అను పేరువచ్చెను.

11. దేవుడు ఇంకను అతనితో “నేను సర్వశక్తిమంతుడగు దేవుడను. నీవు ఫలించి వృద్ధిచెందుము. నీ వలన అనేక జాతులు అవతరించును. నీ నుండి రాజులు పుట్టుదురు.

12. అబ్రహామునకు, ఈసాకునకు ఇచ్చిన దేశమును నీకు ఇచ్చుచున్నాను. నీ తరువాత నీ సంతతికి ఈ దేశమును అప్పగింతును” అని చెప్పెను.

13. దేవుడు తాను మాట్లాడిన తావు నుండి యాకోబును వీడి వెళ్ళెను.

14. యాకోబు దేవుడు తనతో మాట్లాడిన చోట ఒక స్తంభము నెత్తెను. అది శిలాస్తంభము. అతడు దానిపై పానీయమును పోసి, తైలాభిషేకము చేసెను.

15. యాకోబు దేవుడు తనతో మాట్లాడిన చోటికి 'బేతేలు' అను పేరు పెట్టెను.

16. వారు బేతేలునుండి బయలుదేరిరి. ఎఫ్రాతాకు కొంచెము దూరముననుండగా రాహేలు పురిటినొప్పులు పడెను.

17. ఆమెకు ప్రసవవేదన దుర్బరముగా ఉండెను. ఆమె నొప్పులచే బాధపడు చున్నప్పుడు మంత్రసాని “భయపడకుము. నీకు మరీయొక కొడుకు పుట్టబోవుచున్నాడు” అని చెప్పెను.

18. ప్రాణములు పోవుచున్నప్పుడు, చివరి ఊపిరి విడుచుచు రాహేలు కుమారునకు బెనోని' అను పేరు పెట్టెను. కాని తండ్రి అతనిని బెన్యామీను అను పేరున పిలిచెను.

19. ఆ విధముగా రాహేలు మృతినొందెను. ఆమెను ఎఫ్రాతాకు పోవు బాటప్రక్క పాతిపెట్టిరి. ఈ ఎఫ్రాతాయే బేత్లెహేము.

20. యాకోబు ఆమె సమాధి మీద స్తంభమునెత్తెను. ఈనాటికి దానిని 'రాహేలు స్తంభము' అను పేరున పిలచుచున్నారు.

21. ఆ తరువాత యిస్రాయేలు ముందుకు సాగిపోయి ఏదెరు గోపురమునకు అవతల గుడారము వేసెను.

22. యిస్రాయేలు ఆ మండలములందు నివసించుచున్నప్పుడు, రూబేను వెళ్ళి తండ్రి ఉంపుడు కత్తెయగు బిల్హాతో శయనించెను. ఇది యిస్రాయేలు వినెను.

23. యాకోబునకు కొడుకులు పండ్రెండుగురు కలరు. అతనికి మొదట పుట్టిన రూబేను, తరువాతి వారయిన షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాఖారు, సెబూలూను అనువారు లేయా కుమారులు.

24. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.

25. దాను, నఫ్తాలి అనువారు రాహేలు దాసియగు బిల్హా పుత్రులు.

26. గాదు, ఆషేరు అను వారు లేయా దాసియగు జిల్పా సుతులు. వీరందరు పద్దనారాములో పుట్టిన యాకోబు కుమారులు.

27. యాకోబు మమ్రేలో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చెను. ఆ తావునే 'కిరియత్ అర్బా' లేక 'హెబ్రోను' అని అందురు. అబ్రహాము, ఈసాకు అక్కడనే పరదేశులుగ నివసించిరి.

28. చనిపోవునాటికి ఈసాకు వయస్సు నూటయెనుబదియేండ్లు.

29. పండుబారిన వయస్సులో మరణించి, అతడు తన పితరులను చేరుకొనెను. అతని కుమారులు ఏసావు, యాకోబు అతనిని పాతిపెట్టిరి.