ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 31 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 31వ అధ్యాయము

 1. “యాకోబు పూచికపుల్ల కూడ వదలకుండ మన తండ్రి ఆస్తి అంతయు కాజేసెను. మన తండ్రి సొత్తును దోచుకొనుటవలననే అతనికింత వైభవము కలిగినది” అని లాబాను కుమారులు అనుకొనుట యాకోబు వినెను.

2. లాబాను కూడ మునుపటి మాదిరిగా అతనిపట్ల ప్రసన్నుడుగా లేడు.

3. అప్పుడు దేవుడు యాకోబుతో “నీ పితరుల దేశములో ఉన్న బంధువుల యొద్దకు వెళ్ళిపొమ్ము. నేను నీ వెన్నంటి ఉందును” అని చెప్పెను.

4. కావున యాకోబు రాహేలును, లేయాను పొలములోనున్న తన మందల వద్దకు పిలిపించి వారితో,

5. "మీ తండ్రి మునుపటి వలె నాపట్ల ప్రసన్నుడగుటలేదు. అయినప్పటికి మా తండ్రి కొలిచిన దేవుడు నాకు తోడ్పడెను.

6. నేను మీ తండ్రికెట్లు వెట్టిచాకిరి చేసితినో మీకు తెలియును.

7. కాని అతడు నన్ను మోసగించెను. ఇప్పటికి పదిమార్లు అతడు నా జీతమును మార్చియుండెను. దేవుడు మీ తండ్రివలన నాకు ఏ అపాయము కలుగకుండ కాపాడెను.

8. లాబాను పొడలుగల మేకపిల్లలను నీ జీతము క్రింద కట్టుకొనుమన్నప్పుడు . దీనికి భిన్నమయిన అనువాదమును సాధ్యమే. మందలో అన్నియు పొడలుగల మేకపిల్లలే పుట్టెను. చారలుగల మేకపిల్లలను నీ జీతము క్రింద తీసుకొనుమని అన్నప్పుడు మందలో అన్నియు చారల మేక పిల్లలే పుట్టెను.

9. దేవుడు మీ తండ్రి పశువులన్నిటిని నా ఆధీనమునకిచ్చెను.

10. మందలు ఎదకు వచ్చిన ఋతువులో నాకు ఒక కల వచ్చెను. నేను కన్నెత్తి చూచితిని. మందలలోని ఆడుపశువులను దాటుచున్న పోతులకు చారలుగాని, మచ్చలుగాని, పొడలుగాని ఉండెను.

11. కలలో దేవునిదూత 'యాకోబూ!' అని పిలిచెను. 'చిత్తము ప్రభూ!' అని నేనంటిని.

12. అంతట దేవునిదూత 'అదిగో! చూడుము మందలోని మేకలను, గొఱ్ఱెలను దాటుచున్న పోతులకు చారలు గాని, మచ్చలుగాని పొడలుగాని ఉన్నవి. లాబాను నీకెంత అపకారము చేసెనో చూచి నేనే ఈ పని చేసితిని.

13. నీవు స్తంభమునకు తైలాభిషేకముచేసి, మ్రొక్కుకొన్న బేతేలులో నీకు ప్రత్యక్షమయిన దేవుడను నేనే. వెంటనే ఈ దేశమువిడిచి నీవు పుట్టినచోటికి తిరిగిపొమ్ము' అనెను” అని చెప్పెను.

14. రాహేలు, లేయా యాకోబుతో “మాకిక తండ్రి ఇంటిలో పాలుపంపకములులేవు.

15. అతడు మమ్మును మాత్రము కాని వారిగా చూచుటలేదా? మా తండ్రి మమ్ము విక్రయించి వచ్చిన సొమ్మంత తానే మ్రింగెను.

16. దేవుడు మా తండ్రి చేతికి చిక్కకుండచేసిన సొమ్మంత మాది, మా పిల్లలది. కావున దేవుడు చెప్పినట్లే చేయుము” అనిరి.

17. యాకోబు వెంటనే తన కుమారులను, యిల్లాండ్ర నందరను ఒంటెలమీద ఎక్కించెను.

18. వస్తువాహనములను ప్రోగుజేసికొని పద్దనారాములో గడించిన గొఱ్ఱెలమందలను, మేకల గుంపులను, పశుసమూహమును తోలుకొని కనానులోనున్న తండ్రి ఈసాకుకడకు బయలుదేరెను.

19. లాబాను గొఱ్ఱెల ఉన్ని కత్తెర వేయించుటకు వెళ్ళెను. అప్పుడు రాహేలు తన తండ్రికి చెందిన గృహదేవతా విగ్రహములను దొంగిలించెను.

20. తన ప్రయాణము మాట రహస్యముగానుంచి యాకోబు అరమీయుడగు లాబానును మోసగించెను.

21. తనకు ఉన్నదంతయు చంకబెట్టుకొని యాకోబు పారిపోయెను. అతడు యూఫ్రటీసు నదిని దాటి పర్వతమయమైన గిలాదువైపు వెళ్ళిపోయెను.

22. లాబాను మూడు రోజులు తరువాత యాకోబు పారిపోయెనన్న మాట వినెను.

23. అతడు చుట్ట పక్కాలను వెంటబెట్టుకొనిపోయి, ఏడురోజులపాటు యాకోబును వెంటాడి, చివరకు అతనిని గిలాదుకొండ మీద పట్టుకొనెను.

24. కాని ఆ రాత్రి దేవుడు అతనికి కలలో కనబడి “జాగ్రత్త! యాకోబునకు ఏమాత్రము హాని చేయవలదు” అని అరమీయుడగు లాబానును హెచ్చరించెను.

25. లాబాను పట్టుకొన్నప్పుడు యాకోబు గిలాదు కొండ నేలలో గుడారములు వేసికొనియుండెను. ఆ కొండనేలయందే లాబాను కూడ చుట్టపక్కాలతో గుడారములెత్తెను.

26. లాబాను యాకోబుతో “ఇదియేమిపని? నీవు నన్ను మోసగించితివి. కత్తితో చెర పట్టిన వారి మాదిరిగా నా కుమార్తెలను తీసికొని వచ్చితివి.

27. నాతో చెప్పకుండ గుట్టుగా పారిపోయి వచ్చితివేల? నాకు తెలిసినచో, నిన్ను సంతోషముగా మేళతాళములతో సాగనంపి ఉండెడివాడనుగదా!

28. నీవు వచ్చునపుడు నా కుమార్తెలను, వారి పిల్లలను కడసారిగానైన ముద్దాడనీయలేదు. వారితో ఒక్క మాటైన మాట్లాడనీయలేదు. ఎంత తెలివితక్కువ పని చేసితివి!

29. నీకు కీడుచేయుట నాకును చేతనగును. కాని నిన్న రాత్రి మీ తండ్రి దేవుడు నాతో మాట్లాడి నపుడు “జాగ్రత్త! యాకోబుతో మంచిగాని, చెడుగాని మాట్లాడవలదు” అని హెచ్చరించెను.

30. ఇంటిమీద బెంగపుట్టినచో నీవు నీ తండ్రి యింటికి మరలి పోయెదవుగాక! కాని నా దేవతలను దొంగిలించితి వేల?” అనెను.

31. అంతట యాకోబు “నీవు నీ కుమార్తెలను బలాత్కారముగా తీసికొనిపోదువేమో అని భయపడితిని.

32. నీ దేవతావిగ్రహములను దగ్గర పెట్టుకొన్న వారికి చావుమూడినదని తెలిసికొనుము. ఇదిగో! ఇక్కడ ఉన్న మన బంధువుల యెదుట వెదకి, నీదేదైన పూచికపుల్లంత నా దగ్గర ఉన్నచో తిరిగి తీసికొనుము” అనెను. రాహేలు దేవతా విగ్రహములను దొంగిలించి నదని యాకోబునకు తెలియదు.

33. లాబాను లేయా, యాకోబుల గుడార ములు, దాసీ స్త్రీల గుడారములు వెదకెను. అతనికి ఏమియు కనబడలేదు. అతడు లేయా గుడారమునుండి రాహేలు గుడారమునకు వెళ్ళెను.

34. రాహేలు దేవతావిగ్రహములను తీసికొనిపోయి, ఒంటె జీను క్రిందబెట్టి, దానిమీద కూర్చుండియుండెను. లాబాను కంట వత్తి పెట్టుకొని గుడారమంతయు వెదకెను. కాని అతనికేమియు దొరకలేదు.

35. అంతట రాహేలు తండ్రితో "అయ్యా! నీ ముందు లేచి నిలబడలేదని తప్పుపట్టకుము, నేను కడగానుంటిని” అనెను. ఎంత వెదకినను లాబాను గృహదేవతా విగ్రహములను కనుగొనలేకపోయెను.

36. యాకోబు కోపముతో రగిలిపోయెను. అతడు లాబానును మందలించుచు “నేను చేసిన తప్పేమి? నేను ఏ పాపము చేసితినని నీవు ఇట్లు నురుగులు గ్రక్కుకొనుచు వచ్చి నన్ను వెంటాడితివి?

37. నీవు నా సామాగ్రినంతటిని వెదకినను, నీ గృహ సామగ్రిలోని వస్తువు ఒక్కటియైన నీకు కనబడినదా? కనబడినచో ఇదిగో! నావారు నీవారు అందరును ఇక్కడనే ఉన్నారుగదా! వీరి ముందు పెట్టుము. వీరే మన ఉభయుల మధ్య తగిన తీర్పుచెప్పెదరు.

38. నేను నీ దగ్గరనున్న ఇరువదియేండ్లలో ఏనాడును నీ గొఱ్ఱెలలోగాని నీ మేకలలోగానీ ఒక్కటి గూడ పట్టుకొనిపోలేదు. నీ మంద పొట్టేళ్ళను నేను తినలేదు.

39. క్రూరమృగముల వాతబడిన దానిని ఒక్కదానిని గూడ నేను నీ ఎదుటికి తీసికొని రాలేదు. నేనే ఆ నష్టము పెట్టుకొంటిని. పగలుగాని, రేయిగాని ఎవరు దేనిని దొంగలించినను నీవు వెంటనే నాయొద్ద నష్టపరిహారము పుచ్చుకొంటివి.

40. పగలు నిప్పులు చెరుగు ఎండకు మాడిపోతిని. రేయి మూడ మంచు నకు ముద్దయిపోతిని. ఏనాడు కంటిమీద కునుకు పడలేదు.

41. ఈ రీతిగా ఇరువదియేండ్లపాటు నీ ఇంటిలో పడియుంటిని. నీ కుమార్తెలిద్దరి కొరకు పదునాలుగేండ్లు బండ చాకిరిచేసితిని. నీ మందల కొరకు ఆరేండ్లపాటు ఒడలు గుల్లచేసికొంటిని. నీవు కనీసము పదిపర్యాయములైనా నా జీతము మార్చియుందువు.

42. మా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఈసాకు భయపడిన దేవుడు నాకు తోడ్పడ కున్న, నీవు నన్ను వట్టిచేతులతో పం పెడివాడవే? దేవుడు నా కాయకష్టమును, నా బాధలను చూచి గత రాత్రి నిన్ను మందలించెను” అనెను.

43. లాబాను యాకోబునకు బదులు చెప్పుచు “ఈ కుమార్తెలు నా కుమార్తెలే. ఈ పిల్లలు నా పిల్లలే. ఈ మందలు నామందలే, నీవు చూచుచున్నదంతయు నాదే. ఇక నా కుమార్తెలకు, వారు కనిన పిల్లలకు నేడు నేనేమి చేయగలను?

44. ఇటురమ్ము! నీవు నేను ఒక ఒడంబడిక చేసికొందము. అది నీకు నాకు నడుమ సాక్షిగా నుండును” అనెను.

45. అందుచే యాకోబు ఒక పెద్దరాతిని తీసి కొని, దానిని స్తంభముగా నిలబెట్టెను.

46. అప్పుడు అతడు రాళ్ళు ప్రోగుచేయుడని తనవారికి చెప్పెను. వారు రాళ్ళుతెచ్చి కుప్పచేసిరి. దాని దగ్గరనే వారు కలసి భోజనములు చేసిరి.

47. లాబాను దానికి “యగార్ సహదూతా” అను పేరు పెట్టగా, యాకోబు దానికి “గలెదు”' అను పేరు పెట్టెను.

48. అంతట లాబాను “ఈ కుప్పయే నాకు నీకు నడుమసాక్షిగా నుండును” అనెను. ఈ కారణముచేత దానికి గలెదు అను పేరు వచ్చెను.

49. లాబాను “మనము ఒకరి కంటికొకరు కనబడకుండ విడిపోయినపుడు, దేవుడు మనలనిద్దరను ఒకకంట కనిపెట్టునుగాక!” అనెను. కావుననే ఆ తావునకు మిస్సా అను పేరు వచ్చెను.

50. అతడు యాకోబుతో “నీవు నా కుమార్తెలను హింసించిననూ, ఎవ్వరు చూచుటలేదు గదా అని యితర స్త్రీలను పెండ్లాడిననూ దేవుడు నీకు నాకు నడుమ సాక్షిగా నుండునుగాక!” అనెను.

51. లాబాను యాకోబుతో ఇంకను మాట్లాడుచు “నీకు నాకు నడుమ నేను పేర్చిన ఈ కుప్పను చూడుము. నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము.

52. ఈ కుప్ప ఒక సాక్షి. ఈ స్తంభము మరొకసాక్షి, నీకు హాని చేయుటకు నేను ఈ కుప్పదాటి నీవైపురాను. నీవును నాకు కీడు చేయుటకు ఈ కుప్పను, ఈ స్తంభమును దాటి ఈవలకు రావలదు.

53. "అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రిదేవుడు మనకు తీర్పరియై ఉండును” అనెను. యాకోబు “మా తండ్రి ఈసాకు భయపడిన దేవుని తోడు” అని ప్రమాణము చేసెను.

54. అతడు ఆ కొండమీదనే బలి అర్పించి, తనవారిని విందునకు పిలిచెను. వారందరు కలిసి విందారగించి, కొండమీదనే ఆ రాత్రి గడిపిరి.

55. లాబాను మరునాడు తెల్లవారుజామున లేచి కుమార్తెలను వారి పిల్లలను ముద్దాడి, దీవించి ఇంటికి తిరిగివెళ్ళెను.