ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 3 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 3వ అధ్యాయము

 1. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సర్పము జిత్తులమారిది. అది “తోటలో నున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట! నిజమేనా?" అని స్త్రీని అడిగెను.

2-3. దానికి స్త్రీ “తోట నడుమనున్న చెట్టుపండు తప్ప  మిగిలిన ఏ చెట్టు పండయినను మేము తినవచ్చును. ఆ చెట్టుపండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని దేవుడు చెప్పెను” అని బదులిచ్చెను.

4. అంతట సర్పము “ఆ మాట నిజముగాదు. మీరు చావనే చావరు.

5. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, మీరు మంచిచెడులు తెలిసికొని దేవునివలె అగుదురనియు ఎరిగి ఆయన మీకు అటుల చెప్పెను” అని అనెను.

6. స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ‘ఆ పండు వలన తెలివితేటలు గలిగిన, ఎంత బాగుండునోకదా!' అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టుపండ్లు కోసి తానుతిని, తనతోపాటు నున్న తన భర్తకును ఇచ్చెను. అతడును తినెను.

7. అపుడు వారిద్దరి కనులు తెరువబడెను. తాము దిసమొలతో ఉన్నట్లు వారు తెలిసికొనిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి.

8. ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్ల గాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండ చెట్లనడుమ దాగుకొనిరి.

9. కాని దేవుడైన యావే నరుని బయటికి పిలిచి “ఓయి! నీవు ఎక్కడ ఉంటివి?” అని ప్రశ్నించెను.

10. అంతట మానవుడు “తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని. నేను దిసమొలతో ఉంటిని కనుక భయపడి దాగు కొంటిని” అనెను.

11. “నీవు దిసమొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా?” అని దేవుడు ప్రశ్నించెను.

12. “నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని” అని నరుడు చెప్పెను.

13. దేవుడైన యావే “నీవు చేసినదేమిటి?" అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె “సర్పము ఆ పండు తినుమని నన్ను మోసపుచ్చినది, కనుక తింటిని” అని బదులు చెప్పెను.

14. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను: “నీవు ఇంతపని చేసితివి కనుక జంతువులలోను, క్రూరమృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము.

15. నీకును, స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతతికిని మధ్య వైరము కలుగచేయుదును. ఆమె సంతతి నీ తల చితక గొట్టును. నీవేమో వాని మడమ కరిచెదవు.”

16. ఆయన స్త్రీతో ఇట్లనెను: “నీవు గర్భము ధరించినపుడు నీ బాధలు అధికము చేయుదును. నీ ప్రసవవేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్తయెడల నీకు కోరిక కలుగును. అతడు నిన్ను ఏలును.”

17. ఆయన నరునితో ఇట్లనెను: “నీవు నీ భార్య మాటవిని నేను తినవలదనిన చెట్టుపండును తింటివి. నీ వలన ఈ భూమి శాపము పాలయినది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి, కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు.

18. ఈ నేల నీకై ముండ్లతుప్పలను, గచ్చపొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు.

19. నీవు పుట్టిన మట్టిలో మరల కలిసిపోవువరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొందువు. ఈ నీవు మట్టినుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు.”

20. ఆదాము " తన భార్యకు 'ఏవ” అని పేరు పెట్టెను. ఎందుకనగా జీవులందరికి ఆమె తల్లి.

21. అంతట దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవకు తొడిగెను.

22. అప్పుడు దేవుడైన యావే "మానవుడు కూడ మంచిచెడులు గుర్తించి మా సాటివాడయ్యెను. అతడిక చెయ్యిచాచి జీవమిచ్చు చెట్టుపండ్లను కోసికొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో!” అనుకొనెను.

23. కావున ఆయన ఏదెను తోటనుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు ఏ నేలనుండి తీయబడెనో ఆ నేలను సాగు చేయుటకు అతనిని పంపివేసెను.

24. ఈ విధముగా దేవుడు తోటనుండి మానవుని తరిమివేసెను. ఆయన ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబు దూతలను, గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. జీవమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరిని రానీయకుండుటకే దేవుడిట్లుచేసెను.