ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 29 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 29వ అధ్యాయము

 1. యాకోబు ప్రయాణము సాగించి తూర్పు జాతులవారి దేశము చేరెను.

2. అతడు అక్కడి పొలములో ఒక బావిని చూచెను. ఆ బావి ప్రక్క గొఱ్ఱెలమందలు మూడు పండుకొనియుండెను. గొఱ్ఱెలమందలకు ఆ బావినీళ్ళు పెట్టుదురు. ఆ బావి మీద ఒక పెద్ద రాయి ఉండెను.

3. మందలన్ని ఆ బావి దగ్గర చేరినప్పుడు కాపరులు రాతిని దొర్లించి వానికి నీళ్ళు పెట్టుదురు. తరువాత రాతిని తిరిగి బావి పైకి దొరలింతురు.

4. యాకోబు “అన్నలార! మీది ఏ ఊరు?” అని వారినడిగెను. వారు “మాది హారాను” అని బదులుచెప్పిరి.

5. అతడు “మీరు నాహోరు కుమారుడగు లాబానును యెరుగుదురా?” అని అడిగెను. వారు “మేమెరుగుదుము” అని చెప్పిరి.

6. “ఆయన క్షేమముగా ఉన్నాడా?” అని యాకోబు అడిగెను. వారు “ఆయన క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో! ఆయన కూతురు రాహేలు మందవెంట వచ్చుచున్నది!” అని చెప్పిరి.

7. యాకోబు “ఇంకను చాల ప్రొద్దున్నది. మందలను ప్రోగుచేసి పెరడుకు తోలుటకు ఇంకను వేళగాలేదు. గొఱ్ఱెలకు నీళ్ళు పెట్టి, తిరిగి తోలుకొనిపోయి మేపరాదా?” అని వారితో అనేను.

8. “మందలన్నియు వచ్చిన పీదప రాతిని కదలించిన తరువాతగాని గొఱ్ఱెలకు నీళ్ళు పెట్టము” అని వారు బదులు చెప్పిరి.

9. అతడు ఇంకను వారితో మాట్లాడుచుండగనే రాహేలు తన తండ్రిమందను తోలుకొనివచ్చెను. ఆమెయే తన తండ్రిమందను మేపుచుండెను.

10. గొఱ్ఱెలమందతో వచ్చిన తన మేనమామ కూతురు రాహేలును చూచి యాకోబు బావి దగ్గరకు పోయి దానిమీది రాతిని దొరలించి, లాబాను మందకు నీళ్ళు పెట్టెను.

11. అతడు రాహేలును ముద్దు పెట్టుకొని, ఆనందముతో బిగ్గరగా ఏడ్చెను

12. “మీ తండ్రికి అయినవాడను. రిబ్కా కుమారుడను” అని యాకోబు ఆమెతో చెప్పెను. ఆమె ఆనందముతో పరుగెత్తు కొనిపోయి తండ్రితో జరిగినదంతయు చెప్పెను.

13. మేనల్లుడు యాకోబు వచ్చెనన్నమాట విని లాబాను పరుగెత్తుకొని ఎదురువచ్చెను. యాకోబును కౌగలించుకొని ముద్దాడెను. సాదరముగా ఇంటికి తోడ్కొని పోయెను. యాకోబు లాబానుకు జరిగిన విషయములన్నియు పూసగుచ్చినట్లు చెప్పెను.

14. చివరివరకు విని లాబాను “నీవు నా రక్తమాంసములు పంచుకొని పుట్టినవాడవే, ఏ సందేహమును లేదు” అని అనెను. యాకోబు ఒక నెలరోజులపాటు అతని యొద్ద ఉండెను.

15. లాబాను యాకోబుతో “నీవు నాకు బంధువుడవే. అంతమాత్రాన నీవు నాకు ఊరకనే ఊడిగము చేయవలయునా? నీకు ఎంతజీతము కావలయునో చెప్పుము” అనెను.

16. లాబానుకు ఇద్దరు కుమార్తెలు కలరు. వారిలో పెద్దకూతురు పేరు లేయా, చిన్నకూతురు పేరు రాహేలు.

17. లేయా బలహీనమైన కండ్లుకలది. రాహేలు అంగసౌష్టవము గల రూపవతి.

18. యాకోబు రాహేలును ప్రేమించెను. అతడు లాబానుతో “నీ చిన్నకూతురు రాహేలుకొరకు నేను ఏడేండ్లు నీకు ఊడిగము చేయుదును” అనెను.

19. దానికి లాబాను “ఆమెను ఎవనికో ఇచ్చుట కంటే నీకిచ్చుటయేమేలు. నా యొద్దనే ఉండుము” అనెను.

20. యాకోబు రాహేలుకొరకు ఏడేండ్లు కొలువు చేసెను. కాని అతనికి ఏడేండ్లు ఏడు గడియలవలె గడచిపోయెను. అతనికి రాహేలుపట్ల ఉన్న వలపు అట్టిది.

21. అప్పుడు యాకోబు లాబానుతో “పెట్టిన గడువు ముగిసినది. నా రాహేలును నాకు అప్ప గింపుము. మేమిద్దరమును కలిసి కాపురముచేసి కొందుము” అనెను.

22. అంతట లాబాను అక్కడి వారందరిని పిలిపించి విందుచేసెను.

23. చీకటి పడిన తరువాత లాబాను తన కుమార్తెయైన లేయాను యాకోబునొద్దకు తీసుకొనిపోగా, యాకోబు లేయాతో శయనించెను.

24. అప్పుడే లాబాను జిల్పా అను బానిస పిల్లను లేయాకు దాసిగా ఇచ్చివేసెను.

25. తెల్లవారిన తర్వాత ఆ రాత్రి తాను కూడిన ఆమె లేయా అని యాకోబునకు తెలిసెను. అతడు లాబానును “ఇదేమిపని? నేను కొలువు చేసినది రాహేలుకొరకు కదా? నన్ను మోస గించితివేల?” అని అడిగెను.

26. అంతట లాబాను “పెద్దపిల్లకంటె ముందు చిన్నపిల్లకు పెండ్లి చేయుట మా దేశ ఆచారముగాదు.

27. ఈ ఏడురోజుల ఉత్సవము జరిగిపోనిమ్ము. రాహేలును గూడ నీకిచ్చి పెండ్లి చేయుదును. కాని రాహేలును ఇచ్చినందులకు నాకింకను ఏడేండ్లు ఊడిగము చేయవలయును” అనెను.

28. దానికి యాకోబు ఒప్పుకొని, ఏడు రోజుల ఉత్సవము జరుగనిచ్చెను. తరువాత లాబాను రాహేలును యాకోబునకిచ్చి పెండ్లి చేసెను.

29. బిల్హా అను బానిస పిల్లను గూడ తన కుమార్తె రాహేలునకు దాసిగా ఇచ్చివేసెను.

30. యాకోబు రాహేలుతో శయనించెను. అతడు లేయాకంటెను మిక్కుటముగా రాహేలును ప్రేమించెను. మరి ఏడేండ్లు యాకోబు లాబానునకు సేవచేసెను.

31. లేయా భర్త ప్రేమకు నోచుకొనకపోవుట చూచి దేవుడు ఆమెను సంతానవతిగా చేసెను. రాహేలు గొడ్రాలైయుండెను.

32. లేయా చూలాలై కొడుకును కనెను. ఆమె “దేవుడు నా బాధను కనులార చూచెను. ఇప్పుడైన నాభర్త నన్ను ప్రేమించునుగదా” అని అనుకొని బిడ్డకు రూబేను' అను పేరు పెట్టెను.

33. ఆమె మరల గర్భవతియై కుమారునికనెను. "నేను నా నాథుని అనురాగమునకు దూరమైతినని విని దేవుడు నాకు ఈ బిడ్డను గూడ ఇచ్చెను" అని ఆమె అనుకొనెను. కొడుకునకు షిమ్యోను అనుపేరు పెట్టెను.

34. లేయా మరల గర్భముదాల్చి కుమారుని కనెను. ఆమె “నేను నా మగనికి ముగ్గురు కుమారులను కంటిని. ఇక ఆయన నాకు అంటుకొనియుండును” అని అనుకొని మూడవ కుమారునకు లేవి' అను పేరు పెట్టెను.

35. నాలుగవమారు కూడ లేయా గర్భవతియై కుమారుని కనెను. ఆమె “నేనిక దేవుని స్తుతింతును” అని అనుకొని అతనికి యూదా అను పేరు పెట్టెను. తరువాత ఆమెకు కానుపు ఉడిగెను.