ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 28 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 28వ అధ్యాయము

 1. ఈసాకు యాకోబును పిలిపించి, దీవించి అతనికి బుద్ధులు చెప్పుచు “ఈ కనానీయుల పిల్లలలో ఎవ్వతెను పెండ్లాడకుము.

2. పద్దనారాములో ఉన్న వాడును, నీ తల్లికి తండ్రియగు బెతూవేలు ఇంటికి వెంటనే వెళ్ళుము. అక్కడ నీ మేనమామ లాబాను పిల్లలలో ఒకపిల్లను పెండ్లియాడుము.

3. సర్వశక్తి మంతుడగు దేవుడు నిన్ను దీవించి నీ ఇల్లు పదిండ్లు చేయును. అనేక జాతులుగా రూపొందునట్లు నీ సంతతిని విస్తరిల్లచేయును.

4. దేవుడు అబ్రహామును దీవించినట్లే నిన్ను నీ బిడ్డలను దీవించునుగాక! దేవుడు అబ్రహామునకు ప్రసాదించిన ఈ దేశము. నేడు నీవు పరదేశిగా బ్రతుకుచున్న ఈదేశము, నీ వశమగును గాక!” అనెను.

5. ఈ మాటలు చెప్పి ఈసాకు యాకోబును పద్దనారాములో ఉన్న లాబాను కడకు పంపెను. లాబాను అరమీయుడగు బెతూవేలు కుమారుడును, యాకోబు ఏసావుల తల్లియగు రిబ్కా సోదరుడు.

6. ఈసాకు యాకోబును దీవించి, పెండ్లి చేసి కొనుటకై పద్దనారామునకు పంపెననియు, దీవించునపుడు కనానీయుల పిల్లలను పెండ్లియాడవలదని హెచ్చరించెననియు

7. యాకోబు తల్లిదండ్రులమాట తలదాల్చి పద్దనారామునకు వెళ్ళెననియు ఏసావునకు తెలిసెను.

8. తన తండ్రికి కనానీయుల పిల్లలనిన గిట్టదని గ్రహించి,

9. ఏసావు యిష్మాయేలు దగ్గరకు వెళ్ళెను. ఇదివరకున్న భార్యలకు తోడు, అబ్రహాము కుమారుడగు యిష్మాయేలు కుమార్తెయు, నెబాయోతు సోదరియునైన మహలతునుకూడ పెండ్లియాడెను.

10. యాకోబు బేర్పెబా దాటి, హారాను వైపు వెళ్ళు బాటపట్టెను.

11. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయెను. ఆచోట నున్న రాతిని తలదిండుగా చేసికొని, నిద్రపోవుటకు నడుము వాల్చెను.

12. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటు చుండెను. దేవదూతలు నిచ్చెనమీదుగా ఎక్కుచును దిగుచును ఉండిరి.

13. అపుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో “నేను ప్రభుడను, నీ పితామహులగు అబ్రహామునకు, ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ ప్రదేశమును నీకును నీ సంతతికిని అప్పగింతును.

14. నీ సంతతి వారు భూరేణువులవలె అసంఖ్యాకముగా పెరిగిపోయి, నేల నాలుగుచెరగుల వ్యాపింతురు. నీద్వారా, నీ సంతానము ద్వారా భూమండలమందలి సకలవంశముల వారు దీవెనలు బడయుదురు.

16. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చెదను. నేను చెప్పినదంతయు చేయువరకు నిన్ను వదలను” అనెను.

16. యాకోబు మేల్కొని “ఇక్కడ దేవుడుండుట నిజము. ఇది నాకు తెలియదుగదా!” అని అనుకొనెను.

17. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు “ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది! ఈ తావు దైవనిలయము. ఇది పరలోక ద్వారము” అనెను.

18. యాకోబు పెందలకడలేచెను. తలదిండుగా చేసికొనిన రాతిని తీసి, స్తంభముగా నాటెను. దానిమీద తైలముపోసి, దానిని దేవునికి అంకితము చేసెను.

19. ఆ ప్రదేశమునకు బేతేలు' అను పేరు పెట్టెను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూజు.

20. తరువాత యాకోబు “దేవుడు నా వెంట నంటి, ఈ ప్రయాణములో నన్ను కాపాడినయెడల, ఏ యిబ్బంది కలుగకుండ నాకు తినుటకు కూడు, కట్టుకొనుటకు గుడ్డలు సమకూర్చినయెడల,

21. నేను నా తండ్రి ఇంటికి సమాధానముతో తిరిగి వెళ్ళిన యెడల, ఆ ప్రభువే నా దేవుడగును.

22. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక! నీవు నాకు ఇచ్చిన దానిలో పదవ వంతు తిరిగి నీకే చెల్లింతును” అని మ్రొక్కుకొనెను. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services