ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 26 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 26వ అధ్యాయము

 1. అబ్రహాము కాలములో ఒక కరువు వచ్చెను గదా! అదిగాక మరియొక కరువు దేశమున తాండ వించెను. ఈసాకు ఫిలిస్తీయులరాజు అబీమెలెకు దగ్గరకు వెళ్ళెను. అప్పుడు ఆరాజు గెరారులో ఉండెను.

2. దేవుడు ఈసాకునకు ప్రత్యక్షమై "ఐగుప్తు దేశమునకు వెళ్ళకుము. నేను చెప్పినచోట ఉండుము.

3. ఈ దేశమునందే నివసింపుము. నేను నీకు చేదోడుగా ఉందును. నిన్ను దీవింతును. నీకు, నీ సంతతికి ఈ భూములనిత్తును. ఈ విధముగా నేను నీ తండ్రి అబ్రహామునకిచ్చిన మాట నెరవేర్చుకొందును.

4. నీ సంతతివారిని ఆకాశమందలి నక్షత్రములవలె లెక్కకు మిక్కుటమగునట్లు చేయుదును. ఈ భూములన్నియు వారికి పంచి పెట్టుదును. భూలోకమందలి సకల జాతులవారు నీ సంతతిద్వార దీవెనలు పొందుదురు.

5. అబ్రహాము నామాట వినెను. నా ఆజ్ఞలను శిరసావహించెను. అతడు నేను చేసిన కట్టడలు మీర లేదు. నేను కావించిన నియమములను ఉల్లంఘింప లేదు. కావుననే నిన్ను దీవించెదను” అనెను.

6. దేవుని మాటమీద ఈసాకు గెరారులో నివసించెను. .

7. ఆ దేశీయులు తన భార్యను గూర్చి అడుగగా ఈసాకు “ఆమె నా సోదరి” అని చెప్పెను. రిబ్కా తన భార్య అని చెప్పుటకు అతడు భయపడెను. రిబ్కా అందగత్తె. ఆమెవలన తనకు చావు మూడునని ఈసాకు తలంచెను.

8. వారు అక్కడ చాలకాలము నివసించిరి. ఒకనాడు ఫిలిస్తీయులరాజు అబీమెలెకు గవాక్షము నుండి ఈసాకు రిబ్కాతో సరసమాడుటచూచెను.

9. అతడు ఈసాకును పిలిపించి “ఆమె నీ భార్యయే! అవునా? నీ ప్రాణాలమీదికి ఏమొచ్చి ఆమె నా సోదరియని చెప్పితివి?” అనెను. ఈసాకు “ఆమెవలన నాకు ప్రాణాపాయము కలుగునని తలంచి ఆ విధముగా చెప్పితిని” అనెను,

10. అంతట అబీమెలెకు “ఎంత పనిచేసితివి? ఈ దేశప్రజలలో ఎవడో ఒకడు ఏ ఆటంకము లేకుండా ఆమెను కూడెడివాడు. అప్పుడు నీవేమో నింద మానెత్తికి చుట్టెడివాడవు” అనెను.

11. ఇట్లని అబీమెలెకు ఈసాకును గాని అతని యిల్లాలిని గాని ముట్టుకొన్న వారికి చావుమూడునని తన ప్రజలకు హెచ్చరిక చేసెను.

12. ఈసాకు అక్కడ పొలమున విత్తగా ఆ సంవత్సరమే నూరురెట్ల పంట చేతికి వచ్చెను. దేవుడు అతనిని దీవించెను.

13. అతడు క్రమక్రమముగా అభివృద్ధిచెంది చివరకు మహాసంపన్నుడయ్యెను.

14. అతని గొఱ్ఱెలు గొడ్లు మందలుమందలుగా పెరిగెను. అతనికి కావలసినంతమంది బానిసలుండిరి. అతని సిరిని చూచిన ఫిలిస్తీయులకు కన్నుకుట్టెను.

15. వారు ఈసాకు తండ్రి అబ్రహాము కాలమున బానిసలు త్రవ్విన బావులన్నిటిని మన్నుపోసి పూడ్చివేసిరి.

16. అబీమెలెకు ఈసాకుతో “నీవు మాకంటె అధిక శక్తిమంతుడవైతివి. ఇక ఇక్కడనుండి వెళ్ళిపో!” అనెను.

17. ఈసాకు ఆ చోటువదలి, గెరారులోయలో గుడారములు వేసికొని, అక్కడనే నివసించెను.

18. ఫిలిస్తీయులు బావులు వట్టిపోవునట్లు చేసిరిగదా! కనుక, ఈసాకు అబ్రహాము కాలములో త్రవ్విన బావులన్నింటిని తిరిగి త్రవ్వించి వాటికి తన తండ్రి పెట్టిన పేరులనే పెట్టెను.

19. ఈసాకు బానిసలు ఆ లోయలో బావిని త్రవ్వగా మంచి జలపడెను.

20. కాని గెరారు గొఱ్ఱెల కాపరులువచ్చి, ఆ నీళ్ళు మావియనుచు ఈసాకు గొఱ్ఱెలకాపరులతో వాదనకు దిగిరి. వారు తనతో జగడమాడుటచే ఈసాకు ఆ బావికి “ఎసెకు" అను పేరు పెట్టెను.

21. ఈసాకు పనివారు మరియొక బావిని త్రవ్విరి. ఆ గొఱ్ఱెల కాపరులు దానికొరకును పోట్లాడిరి. కావున ఈసాకు ఆ బావికి “సిత్నా" అను పేరు పెట్టెను.

22. అతడు అక్కడినుండి కదలి పోయి మరియొక బావిని త్రవ్వించెను. దానికి ఏ జగడము లేదు. కావున ఈసాకు ఆ బావికి “రెహోబోతు” అను పేరు పెట్టి “ఈనాటికి దేవుడు మాకు కావలసినంతచోటు చూపించెను. మేమిక ఈ దేశమున అభివృద్ధి చెందగలము” అనెను.

23. ఈసాకు అక్కడనుండి బేరైబాకు వెళ్ళెను.

24. ఆ రాత్రి దేవుడు అచట ప్రత్యక్షమై అతనితో: “నేను నీ తండ్రి అబ్రహాము కొలిచిన దేవుడను. భయపడకుము. నేను నీకు చేదోడుగా ఉందును. నా దాసుడు అబ్రహామును బట్టి నిన్ను దీవింతును. నీ సంతతిని విస్తరిల్లచేయుదును.” అని అనెను.

25. ఈసాకు అక్కడ ఒక బలిపీఠమును నిర్మించెను. దేవుని ఆరాధించెను. అక్కడనే గుడారము వేసికొనెను. అతని బానిసలు అక్కడ కూడ ఒక బావిని త్రవ్విరి.

26. అబీమెలెకు తన సలహాదారుడు అయిన అహూసతుతో, సేనాధిపతి ఫీకోలుతో గెరారు నుండి ఈసాకు కడకు వచ్చెను.

27. ఈసాకు వారితో “మీరు ఇక్కడికి ఏలవచ్చితిరి? నామీద పగపట్టి నన్ను తరిమివేసితిరే!” అనెను.

28. అంతట వారు “దేవుడు నీకు చేదోడువాదోడుగా ఉండుట మేము మా కన్నులార చూచితిమి. మనము ప్రమాణ బద్దులమై ఒక ఒడంబడిక చేసికొనుట మంచిదని తలంచితిమి.

29. మేము నిన్ను తాకనైనతాకలేదు. నీకు మేలుతప్ప కీడన్నది చేయలేదు. నిశ్చింతగా నీదారిన నిన్ను పోనిచ్చితిమి. నీకు దైవబలము కలదు. మేము నీకు కీడుచేయనట్టే, నీవును మాకు ఎట్టికీడును చేయనని మాట ఇమ్ము” అనిరి.

30. అంతట ఈసాకు వారికి విందుచేసెను. వారు తిని త్రాగిరి.

31. వారు ప్రొద్దుననే లేచి పరస్పరము ప్రమాణములు చేసికొనిరి. పిదప ఈసాకు వారిని సాగనంపగా వారు మిత్ర భావముతో వెళ్ళిపోయిరి.

32. ఆనాడే ఈసాకు బానిసలువచ్చి తాము త్రవ్విన క్రొత్తబావిని గూర్చి చెప్పిరి. “బావిలో నీళ్ళు పడినవి” అని చెప్పిరి.

33. ఈసాకు ఆ బావికి షేబా అను పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడ ఆ నగరమును 'బెర్షెబా" అను పేరిట పిలుచుచున్నారు.

34. నలువదియవ యేట ఏసావు యూదితును, బాసెమతును పెండ్లియాడెను. యూదితు, హిత్తీయుడగు బీరీ కుమార్తె, బాసెమతు హిత్తీయుడగు ఏలోను కుమార్తె.

35. ఈ ఇరువురివలన ఈసాకునకును, రిబ్కాకును తీవ్ర మనస్తాపము కలిగెను.