ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 25 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 25వ అధ్యాయము

 1. అబ్రహాము మరియొక స్త్రీని కూడ వివాహ మాడెను. ఆమె పేరు కతూరా.

2. ఆమె అతనికి సిమ్రాను, యోక్షాను, మేదాను, మీద్యాను, ఇష్బాకు, షువానులను కనెను.

3. యోక్షాను షబా, దెదానులకు తండ్రి అయ్యెను. దెదానునకు అస్సూరీము, లెతూషీము, లెయుమ్మీము అనువారు కుమారులు.

4. మిద్యానునకు ఏఫ, ఏఫరు, హనోకు, అబీదా, ఎల్దయా అనువారు కుమారులు. వీరందరు కతూరా సంతతివారు.

5. అబ్రహాము తనకున్నదంతయు ఈసాకున కిచ్చెను.

6. అతడు తాను చనిపోవకమునుపే తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చెను. కుమారుడు ఈసాకునకు ఏ అంతరాయము కలుగకుండ వారిని తూర్పువైపుగా తూర్పుదేశమునకు పంపివేసెను.

7. చనిపోవునాటికి అబ్రహాము వయస్సు నూట డెబ్బది అయిదేండ్లు.

8. అతడు దీర్ఘకాలము జీవించి, పండుముసలితనమున రాలిపోయి, తన పితరుల యొద్దకు చేర్చబడెను.

9. అబ్రహాము కుమారులు ఈసాకు, యిష్మాయేలు అతనిని మమ్రేకు తూర్పున ఉన్న మక్ఫేలా గుహలో పాతి పెట్టిరి. ఆ గుహ ఉన్న భూమి తొలుత హిత్తియుడు, సోహరు కుమారుడైన ఎఫ్రోనునకు చెందినది.

10. అబ్రహాము ఆ పొలమును హిత్తియులనుండి కొనెను. అబ్రహామును, అతని భార్య సారాను అచ్చటనే పాతి పెట్టిరి.

11. అబ్రహాము చనిపోయిన పిదప దేవుడు ఈసాకును చల్లనిచూపు చూచెను. అతడు 'బేయెర్ లహాయిరోయి' బావియొద్ద స్థిరపడెను.

12. ఐగుప్తుదేశీయురాలు, సారా దాసియగు హాగారు అబ్రహామునకు కనిన యిష్మాయేలు వంశీ యుల వృత్తాంతమిది.

13. జన్మక్రమమును బట్టి యిష్మాయేలు కుమారుల పేరులివి: యిష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు.

14-15. అతని తరువాత కేదారు, అద్బేలు, మిబ్సము, మిష్మా, దుమా, మస్సా, హదాదు, తెమా, యాతూరు, నాఫీషు, కెద్మా అనువారు పుట్టిరి.

16. వీరు యిష్మాయేలు కుమారులు. వారు తమ గ్రామములకు, విడుదులకు తమ పేరులే పెట్టుకొనిరి. వీరు పండ్రెండుగురు వంశకర్తలై పండ్రెండుతెగలవారైరి.

17. యిష్మాయేలు నూటముప్పదియేడేండ్లు జీవించి మరణించెను. అతడు చనిపోయి తన పితరులవద్దకు చేర్చబడెను.

18. యిష్మాయేలు కుమారులు తమ ప్రజలకు దూరముగా హవీలా షూరుల నడుమనున్న దేశమున నివసించిరి. ఆ ప్రదేశము అస్సిరియాకు పోవు మార్గమున, ఐగుప్తునకు తూర్పున కలదు.

19. అబ్రహాము కుమారుడు ఈసాకు వృత్తాంతమిది.

20. నలువదియవయేట ఈసాకు రిబ్కాను పెండ్లియాడెను. ఆమె పద్దనారామునకు చెందిన అరమీయుడగు బెతూవేలు కూతురు, అరమీయుడగు లాబాను సోదరి,

21. రిబ్కా గొడ్రాలగుటచే ఆమె కొరకు ఈసాకు దేవుని వేడుకొనెను. దేవుడు అతని మనవిని వినెను. రిబ్కా గర్భవతియయ్యెను.

22. ఆమె గర్భమున ఉన్న శిశువులు ఒకరినొకరు గట్టిగా నెట్టుకొనిరి. అపుడామె “ఈ విధముగా జరిగినచో ఇక  నేను బ్రతికి ఏమి లాభము?” అనుకొని దేవుని సంప్రతింపబోయెను.

23. దేవుడు ఆమెతో ఇట్లనెను: “నీ గర్భమున రెండుజాతులు గలవు. పరస్పర వైరముగల రెండు జాతులు నీ గర్భమునుండి వెలువడును. ఒకజాతి రెండవజాతికంటె బలిష్ఠముగా ఉండును. పెద్దవాడు చిన్న వానికి దాసుడగును.”

24. నెలలు నిండినపిదప ఆమె గర్భమున కవల పిల్లలు ఉన్నట్లు తెలిసినది.

25. మొదట పుట్టినబిడ్డ ఎఱ్ఱగా నుండెను. రోమవస్త్రమువలె అతని ఒడలి యందంతట వెండ్రుకలు ఉండెను. అతనికి ఏసావు అను పేరు పెట్టిరి.

26. మొదటిబిడ్డ పుట్టిన వెంటనే అతని మడమపట్టుకొని రెండవ బిడ్డ కూడ పుట్టెను. కావున రెండవ వానికి యాకోబు అను పేరు పెట్టిరి. వారిరువురు పుట్టినపుడు ఈసాకు వయస్సు అరువదిది యేండ్లు.

27. పిల్లలిద్దరు పెరిగి పెద్దవారైరి. ఏసావు వేట యందు నేర్పరియై అరణ్యవాసి అయ్యెను. యాకోబు సౌమ్యుడై గుడారములకు అంటిపెట్టుకొని ఉండెను.

28. ఎల్లప్పుడు తనకు జింకమాంసమును తెచ్చి యిచ్చుచున్న ఏసావుపట్ల ఈసాకునకు అనురాగము ఎక్కువ. కాని రిబ్కాకు యాకోబుపట్ల ఆదరము మెండు.

29. ఒకనాడు యాకోబు పులుసు చేసెను. అప్పుడే ఏసావు అలసిసొలసి పొలమునుండి వచ్చెను.

30. అతడు యాకోబుతో “నేను అలసిపోతిని. ఆ ఎర్రని పులుసును కొంచెము త్రాగనిమ్ము” అనెను. కావుననే అతనికి ఎదోము అనుపేరు వచ్చినది.

31. దానికి యాకోబు “జ్యేష్ఠునిగా నీకున్న హక్కులను నాకు నేడు అమ్మివేయుము” అనెను.

32. ఏసావు "నేను మృత్యు ముఖమున ఉన్నాను. ఇక ఈ జ్యేషాధికారము వలన నాకేమి మేలు కలుగును?” అనెను.

33. దానికి యాకోబు “అది కుదరదు. ముందు దానిని వదలు కొన్నట్లు ప్రమాణముచేయుము” అనెను. ఏసావు ప్రమాణముచేసి తన జ్యేషాధికారమును యాకోబునకు సంక్రమింపజేసెను.

34. అప్పుడు యాకోబు ఏసావునకు రొట్టెను, చిక్కుడుకాయల పులుసును వడ్డించెను. ఏసావు తిని, త్రాగి, లేచి వెళ్ళిపోయెను. ఈ విధముగా ఏసావు జ్యేషాధికారమును తృణీకరించెను.