ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 15 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 15వ అధ్యాయము

 1. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రామునకు దర్శనమున ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవునిమాట వినబడెను. “అబ్రామూ! భయపడకుము. నేను నిన్ను డాలువలె కాపాడెదను. నీకొక గొప్ప బహుమానము ఇచ్చుచున్నాను” అనెను.

2. అంతట అబ్రాము “ప్రభూ! నీవు నాకేమి యీయగలవు? నేను సంతానములేని వాడనైతిని. దమస్కువాడయిన ఎలియెజెరే నా యింటికి వారసుడు అగునుగదా!” అనెను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను:

3. “నీవు నాకు సంతానము కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడు అగును.”

4. అంతట అబ్రామునకు దేవునిమాట ఇట్లు వినవచ్చెను: “ఇతడు నీకు వారసుడు కాడు. నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును.”

5. దేవుడు అబ్రామును వెలుపలికి తీసికొనివచ్చి “ఆకాశమువైపు చూడుము. లెక్కపెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము. నీ సంతతి కూడ అలాగుననే అగును” అని చెప్పెను.

6. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను.

7. దేవుడు అతనితో “నేను సర్వేశ్వరుడను. ఈ దేశమును నీ వశముచేయుటకు నేనే కశీయుల ఊరు నగరమునుండి నిన్నుకొని వచ్చితిని” అనెను.

8. అబ్రాము “ప్రభూ! ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియును?” అనెను.

9. దానికి ప్రభువు “మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల ఆడుమేకను, మూడేండ్ల పొట్టేలును, ఒకగువ్వను, ఒక పావురమును నా యొద్దకు తీసికొనిరమ్ము” అనెను.

10. అబ్రాము వాటినన్నిటిని తీసికొనివచ్చెను. జంతువులను నడిమికి రెండుముక్కలుగా నరికెను. దేని ముక్కను దాని ముక్కకు ఎదురునుంచెను. పక్షులను మాత్రము కోయలేదు.

11. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి. కాని అబ్రాము వానిని తోలివేసెను.

12. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్రపట్టెను. భయానకమైన మహాగాఢాంధకారము అతనిని క్రమ్మెను.

13. ప్రభువు అబ్రాముతో “ఇది నిశ్చయమని తెలుసుకొనుము. నీ సంతతివారు వారిది కాని దేశములో పరదేశులుగా వసించి, ఆ దేశపు వారికి బానిసలగుదురు. ఆ దేశీయులు నాలుగు వందల యేండ్లపాటు నీ వారిని పీడింతురు.

14. పీడించిన జాతిని నేనే శిక్షింతును. తరువాత నీ సంతతివారు ఐశ్వర్యముతో తులదూగుచు ఆ దేశమునుండి బయటబడుదురు.

15. ఏ దిగులు లేకుండ నీవు నీ పితరులను కలిసికొందువు. పండు ముసలితనమున నిన్ను పాతి పెట్టుదురు.

16. నీ తరువాత నాలుగవ తరము వారు తిరిగి ఇక్కడికి వత్తురు. అప్పటికిగాని అమోరీయుల పాపము పండదు.” అనెను.

17. అంతట ప్రొద్దుకూకి చీకటిపడెను. అప్పుడు పొగ కుంపటి, నిప్పుమంట కనబడి మాంసఖండముల నడుమగా కదలిపోయెను.

18. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసికొని “ఐగుప్తు దేశపునది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకుగల భూఖండమును నీ సంతతికి ధారపోయుచున్నాను.

19-21. ఆ భూఖండము కేనీయులకు, కనిస్సీయులకు, కద్మోనీయులకు, హిత్తీయులకు, పెరిస్సీయులకు, రెఫాయీలకు, అమోరీయులకు, కనానీయులకు, గిర్గాషీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు చెందినట్టిది” అని చెప్పెను.