ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 13 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 13వ అధ్యాయము

 1. అబ్రాము భార్యను వెంటబెట్టుకొని తన సర్వస్వముతో ఐగుప్తు దేశమునుండి నేగేబునకు తిరిగి వచ్చెను. లోతు కూడ అతని వెంటవెళ్ళెను.

2. ఇప్పుడు అబ్రాము పశుసంపదతో, వెండి, బంగారములతో తులదూగుచుండెను.

3. విడుదులు చేయుచు అతడు నేగేబునుండి బేతేలునకు వెళ్ళెను. పిదప బేతేలునకు హాయికి నడుమ మొట్టమొదట తాను గుడారములు ఎత్తినచోటికి వచ్చెను.

4. అక్కడనే యింతకుముందు అబ్రాము ప్రభువునకు బలిపీఠమును నిర్మించెను. అచ్చటనే దేవుని ఆరాధించెను.

5. లోతు కూడ అబ్రామువెంట ప్రయాణములు చేసెను. అతనికిని గొఱ్ఱెలు, గొడ్డుగోదలు, గుడారములు కలవు.

6. వారిరువురును కలిసి కాపురములు చేయుటకు ఆ చోటు చాలలేదు. పశుసంపద విరివిగానుండుటచే వారిరువురు కూడి ఒక ప్రదేశమున నివసింపలేక పోయిరి.

7. అదియునుగాక అబ్రాము గొఱ్ఱెలకాపరులకు, లోతు గొఱ్ఱెలకాపరులకు నడుమ కలహములు పెట్టెను. ఆ కాలమందు ఆ ప్రదేశమునందే కనానీయును, పెరిస్సీయులును నివసించుచుండిరి.

8. అందుచే అబ్రాము లోతుతో “మనము అయినవారము, మనలోమనకు జగడములు రాగూడదు. నా గొఱ్ఱెల కాపరులు, నీ గొఱ్ఱెల కాపరులు క్రుమ్ము లాడుకొనరాదు.

9. కావలసినంత నేల నీముందున్నది. మనము విడిపోవుటమేలు. నీవు ఎడమ వైపునకు వెళ్ళిన నేను కుడివైపునకు వెళ్ళెదను. నీవు కుడివైపునకు వెళ్ళిన నేను ఎడమవైపునకు వెళ్ళెదను” అనెను.

10. లోతు కన్నులెత్తిచూచి యోర్ధాను మైదానము మంచి నీటివనరులు గలదని కనుగొనెను. సోయరుకు పోవుత్రోవ పొడుగున అది దేవుని తోటవలె, ఐగుప్తుదేశమువలె ఉండెను. దేవుడు సొదొమ, గొమొఱ్ఱాలను నాశనము చేయకమునుపు ఆ ప్రదేశము ఆ విధముగనుండెను.

11. కావున లోతు యోర్ధాను మైదానములను కోరుకొని తూర్పు వైపునకు వెడలిపోయెను. ఈరీతిగా వారు విడిపోయిరి.

12. అబ్రాము కనాను దేశమందు నివసించెను. కాని లోతు మైదానమునందలి నగరములలో కాపురము ఉండెను. సొదొమ వద్ద గుడారములు నాటెను.

13. సొదొమ ప్రజలు దుష్టులు, యావేకు విరుద్ధముగా పాపము చేయువారు.

14. లోతు, అబ్రాము విడిపోయిన తరువాత, దేవుడు అబ్రాముతో “అబ్రామూ! నీవున్న తావునుండి కనులెత్తి నాలుగుదిక్కులు చూడుము.

15. నీ కను చూపుమేర నేలను నీకును, నీ సంతతికిని శాశ్వతముగా ఇత్తును.

16. భూరేణువులవలె అసంఖ్యాక ముగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. భూరేణువుల వలె నీ సంతతియు లెక్కకు అందదు.

17. నీవు లేచి ఈ దేశమునందంతట సంచరింపుము. దీనిని నీకు ఇచ్చుచున్నాను” అనెను.

18. అందుచే అబ్రాము తన పరివారముతో తరలివెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూరవృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునకు బలిపీఠము నిర్మించెను.