ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 11 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 11వ అధ్యాయము

 1. ఒకానొకప్పుడు భూమిమీది జనులందరు ఒకే భాషను మాట్లాడిరి. ఆ భాషలోని మాటలు ఒక తీరుగనే ఉండెడివి.

2. మానవులు తూర్పుగా ప్రయాణమై పోవుచుండగా వారికి షీనారు దేశమందలి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి.

3. వారు “ఇటుకలు చేసి బాగుగా కాల్చెదము రండు” అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్ళకు బదులుగా ఇటుకలను, అడుసునకు బదులుగా మట్టికీలును వాడిరి.

4. “రండు! మనము ఒక పట్టణమున నిర్మించి, ఆకాశమునంటు గోపురము కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును, మనము భూమి యందంతట చెల్లాచెదరయిపోము” అని వారు అనుకొనిరి.

5. అప్పుడు మానవమాత్రులు నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భువికి దిగివచ్చెను.

6. "ఇదిగో వీరందరు ఒక ప్రజయే. వీరి భాషయు ఒకటియే. అయినను వీరు ఈ పని మొదలు పెట్టిరి. వీరు తలపెట్టిన పనినెల్ల ఏ ఆటంకము లేకుండ కొనసాగింతురు.

7. రండు! మనము దిగిపోయి, వారు ఒకరితోనొకరు చెప్పుకొను మాటలు అర్ధము గాకుండ, వారి భాషను తారుమారు చేయుదము” అని అనుకొనెను.

8. ఇట్లనుకొని దేవుడు వారినందరను అక్కడినుండి భూమి నాలుగు చెరగులకు చెదరగొట్టెను. వారు నగరమును నిర్మించుట మానివేసిరి.

9. దేవుడు ప్రపంచమునందలి ప్రజలు అందరును మాట్లాడు భాషను అక్కడ తారుమారు చేసెను. కావున దానికి బాబేలు' అను పేరు వచ్చెను. అక్కడి నుండియే నేల నాలుగు వైపులకు దేవుడు మానవులను చెదర గొట్టెను.

10. షేము వంశము ఇది. జలప్రళయము వచ్చిన రెండేండ్లకు షేము నూరేండ్ల వయస్సున అర్పక్షదును కనెను.

11. అర్ఫక్షదు పుట్టిన తరువాత షేము ఐదువందల యేండ్లు జీవించెను. అతనికింకను కుమారులు కుమార్తెలు పుట్టిరి.

12. అర్ఫక్షదు ముప్పదిదైదేండ్ల వయస్సున షేలాను కనెను.

13. తరువాత అతడు నాలుగువందల మూడేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి.

14. షేలా ముప్పదియేండ్ల వయస్సున ఏబేరును కనెను.

15. తరువాత షేలా నాలుగువందల మూడేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు జన్మించిరి.

16-17. ఏబెరు ముప్పది నాలుగేండ్ల యీడున పెలెగును కనెను. తరువాత అతడు నాలుగువందల ముప్పదియేండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి.

18-19. పెలెగు ముప్పదియేండ్లప్పుడు రయూను కనెను. తరువాత అతడు రెండువందల తొమ్మిదియేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి.

20-21. రయూ ముప్పది రెండేండ్ల యీడున సెరూగును కనెను. తర్వాత అతడు రెండువందల యేడేండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు, కుమార్తెలు పుట్టిరి.

22-23. సెరూగు ముప్పది యేండ్ల వయస్సున నాహోరును కనెను. తరువాత అతడు రెండు వందల యేండ్లు జీవించెను. అతనికి కుమారులు కుమార్తెలు కలిగిరి.

24-25. నాహోరు ఇరువది తొమ్మిదియేండ్ల వయస్సున తెరాను కనెను. తరువాత అతడు నూట పందొమ్మిదియేండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి.

26. తెరా డెబ్బది యేండ్లప్పుడు అబ్రామును, నాహోరును, హారానును కనెను.

27. తెరా సంతతివారి వంశవృక్షము ఇది: తెరా అబ్రాము, నాహోరు, హారానులను కనెను. హారానుకు లోతు పుట్టెను.

28. హారాను స్వదేశములో కల్దీయు లకు చెందిన ఊరు అను పట్టణములో తండ్రి కన్నుల యెదుట చనిపోయెను.

29. అబ్రాము, నాహారు వివాహములు చేసికొనిరి. అబ్రాము భార్య పేరు సారయి, నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె హారాను కూతురు. హారానుకు యిస్కా అను మరియొక కుమార్తె కూడ కలదు.

30. సారయి గొడ్రాలు.

31. తన కుమారుడు అబ్రామును, హారాను కుమారుడును తన మనుమడగు లోతును, అబ్రాము భార్యయు తన కోడలునుయగు సారయిని తెరా వెంటబెట్టుకొని కల్డీయుల నగరమైన ఊరు నుండి కనాను దేశమునకు బయలుదేరెను. కాని, వారు హారాను చేరిన తరువాత అక్కడనే నివసించిరి.

32. హారానులో మరణించు నాటికి తెరా వయస్సు రెండువందల ఐదేండ్లు,