ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Genesis chapter 1 in telugu || Telugu Catholic Bible || ఆదికాండము 1వ అధ్యాయము

 1. ఆదిలో దేవుడు ఆకాశమును, భూమిని సృష్టించెను.

2. భూమికి ఒక ఆకారము లేకుండ శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించియుండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను.

3. అపుడు 'వెలుగు కలుగునుగాక” అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను.

4. దేవుని కంటికది బాగుగా నుండెను. ఆయన చీకటినుండి వెలుగును వేరుచేసెను.

5. వెలుగునకు పగలని, చీకటికి రాత్రియని పేర్లు పెట్టెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే మొదటి రోజు.

6. “నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని రెండు భాగములుగా విడదీయును గాక" అని దేవుడానతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను.

7. పై నీటి నుండి క్రింది నీటిని వేరుచేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను.

8. ఆయన ఆ గుండ్రని కప్పునకు 'ఆకాశము' అని పేరు పెట్టెను. అంతట సాయంకాలము గడచి, ఉదయమాయెను. అదే రెండవ రోజు.

9.' 'ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రింద నున్న నీరంతా ఒక చోట నిలుచును గాక!" అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను.

10. ఆరిన నేలకు భూమియని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికది బాగుగానుండెను.

11."గింజల నిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్నిరకముల వానిని భూమి మొలిపించును గాక" అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను.

12. భూమి గింజల నిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికది బాగుగా నుండెను.

13. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే మూడవ రోజు.

14. 'రాత్రినుండి పగటిని వేరుచేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు, ఆకాశమున జ్యోతులు అవతరించును గాక!

15. అవి భూమికి వెలుగు నిచ్చుటకు ఆకాశమున ప్రకాశించును గాక!" అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను.

16. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును. చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడ సృష్టించెను.

17-18. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికది బాగుగా నుండెను.

19. అంతట సాయంకాలము గడచి, ఉదయమాయెను. అదే నాల్గవ రోజు.

20. "జలములందు పలురకముల ప్రాణులు పుట్టును గాక! ఆకాశమున పక్షులు ఎగురును గాక” అని దేవుడు అనెను. ఆ ప్రకారమే జరిగెను.

21. దేవుడు సముద్రములో మహా తిమింగిలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను, పలురకముల పక్షులను సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను.

22. వాని నన్నిటిని దీవించి “జలములందలి ప్రాణులు వృద్ధిచెంది సముద్రములో నిండియుండును గాక! నేలమీద పక్షులు లెక్కకు మిక్కుటమగును గాక!" అని ఆనతిచ్చెను.

23. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే అయిదవ రోజు.

24. "భూమి పెంపుడు జంతువులను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించును గాక" అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను.

25. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను.

26. దేవుడు “ఇక ఇప్పుడు మానవజాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును. అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశమందు పక్షులపై, నేలమీది పెంపుడు ప్రాణులపై, క్రూరమృగము లపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగి యుండును" అనుకొని,

27. దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. స్త్రీ, పురుషులుగా వారిని సృజించెను.

28. దేవుడు వారిని దీవించెను: ఫలించి,"సంతానాభివృద్ధి పొంది, భూమండల మందంతట వ్యాపించి, దానిని వశము చేసికొనుడు. నీళ్ళలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు.

29. గింజలనిచ్చు మొక్కలన్ని విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్ని మీకిచ్చితిని. అవి మీకాహారమగును.

30. కాని నేల మీది మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేలమీద ప్రాకెడు జంతువుల కు జీవులన్నిటికిని పచ్చని మొక్కలు ఆహారమగును"అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను.

31. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూచెను. ఆయన కంటికది చాల బాగుగానుండెను. అదే ఆరవ రోజు.